
- అసిస్టెంట్ మేనేజర్ సహా 9 మందిపై కేసు రిజిస్టర్
హైదరాబాద్, వెలుగు: పెద్దపల్లి రామగుండం సైట్ బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొడపె సునీల్కుమార్ సహా మొత్తం 9 మందిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. బాయిలర్ కాంట్రాక్టుల్లో జరిగిన అవకతవకల కారణంగా బీహెచ్ఈఎల్కు రూ.35.03 కోట్లు నష్టం వాటిల్లిందని బీహెచ్ఈఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ (విజిలెన్స్) హరీశ్ కుమార్ గుప్తా ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నది.
ఫోర్జరీ, నకిలీ బిల్స్తో రూ.35.03 కోట్లు గోల్మాల్ 2017-–-22 మధ్య కాలంలో రామగుండం సైట్లోని 2x800 ఎమ్డబ్య్లూ ఎన్టీపీసీ బాయిలర్ కోసం ఎరక్షన్, కమీషనింగ్ పనులకు కోల్కతాకు చెందిన బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ ఇండియా లిమిటెడ్ దాని కాంట్రాక్టర్ సంస్థ పవర్ ఇన్ఫ్రామెచ్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టాయి. కాంట్రాక్టు అమలులో ఉన్న సమయంలో బ్రిడ్జ్ అండ్ రూఫ్ ఇండియా కంపెనీ లిమిటెడ్ పలు వేతన బిల్లులను బీహెచ్ఈఎల్కు సమర్పించింది.
బిల్లుల జారీ, మంజూరు విషయంలో రామగుండం సైట్ బీహెచ్ఈఎల్ ఏజీఎం సునీల్ కుమార్ సహా ఎన్టీపీసీ సిబ్బంది, పలువురు ప్రైవేట్ వ్యక్తులు అవకతవకలు పాల్పడ్డారు. ఫోర్జరీ, నకిలీ బిల్స్తో రూ.35.03 కోట్ల అదనపు చెల్లింపులు జరిపారు. ఇందుకుగాను బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ ఉద్యోగులు సహా బ్రిడ్జ్ అండ్ రూఫ్ ఇండియా, పవర్ ఇన్ఫ్రామెచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లాభం పొందారు.
నిధుల గోల్మాల్పై నాగ్పూర్ బీహెచ్ఈఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ (విజిలెన్స్) హరీశ్ కుమార్ గుప్తా విచారణ జరిపారు. ఈ ఏడాది మార్చి 12న హైదరాబాద్ జోన్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. ఆధారాలు సేకరించారు. అక్టోబర్ 14న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా పెద్దపల్లి రామగుండం సైట్ బీహెచ్ఈఎల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొడపె సునీల్కుమార్ను, ఏ2గా మేనేజర్ సంజన్ కుమార్ సొనిని నిందితులుగా చేర్చింది.