న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ కు బుధవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. ఐదేండ్ల (2019) క్రితం నమోదైన అక్రమ మైనింగ్ కేసుల్లో సాక్షిగా విచారించేందుకు గురువారం హాజరు కావాలని పేర్కొంది. 2012 నుంచి 2017 మధ్య అఖిలేశ్ యాదవ్యూపీ సీఎంగా ఉన్నారు. అలాగే, 2012 –13 మధ్య మైనింగ్ పోర్ట్ ఫోలియోను ఆయనే చూసుకున్నారు. ఆ సమయంలో మైనింగ్ లీజుల జారీకి సంబంధించి ఈ -టెండరింగ్ ప్రక్రియను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి.
దీంతో 2019లో సీబీఐ కేసు నమోదుచేసి ఎంక్వైరీ మొదలు పెట్టింది. మైనింగ్పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించినప్పటికీ అప్పటి ప్రభుత్వ ఉద్యోగులు 2012-–16 మధ్య కాలంలో అక్రమంగా మైనింగ్కు అనుమతించారని, లైసెన్సులు రెన్యూవల్ చేశారని ఆరోపించింది. 2013 ఫిబ్రవరి 17న అప్పటి సీఎం అఖిలేశ్ యాదవ్ కార్యాలయం ఒకేరోజు 13 ప్రాజెక్టులను క్లియర్ చేసిందని పేర్కొంది. ఈ ఆరోపణలపై తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని సీబీఐ ఆదేశించింది.
నోటీసులు వస్తాయని ముందే తెలుసు: అఖిలేశ్
ఎన్నికలు రాగానే నోటీసులు కూడా వస్తాయని తనకు ముందే తెలుసని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్అన్నారు. 2019 లోనూ లోక్సభ ఎన్నికల ముందు నోటీసులు ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో నోటీసులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.