
గుడిహత్నూర్, వెలుగు: పీహెచ్సీలో సీలింగ్ఫ్యాన్ఊడి పడి రెండు రోజుల పసికందుకు గాయమైన ఘటన ఆదిలాబాద్జిల్లాలో జరిగింది. గుడిహత్నూర్ మండలం కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో డెలివరీ కాగా.. ఆడపిల్ల పుట్టింది. తల్లి, బిడ్డను ఆరోగ్య పర్యవేక్షణలో భాగంగా పీహెచ్సీలోనే ఉంచారు. ఆదివారం ఉదయం ఆకస్మాత్తుగా స్లాబు సీలింగ్ నుంచి ఫ్యాను ఊడి బాలింత మంచంపై పడింది. దీంతో తల్లి పొత్తిళ్లలోని పసికందు తలకు దెబ్బ తగిలింది.
డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ తిరుమల వెంటనే మెడికల్ ఆఫీసర్ కు సమాచారం అందించింది. అనంతరం పసికందును 108లో చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ఘటనపై మెడికల్ ఆఫీసర్ శ్యాంసుందర్ను వివరణ కోరగా రిమ్స్కు వెళ్లి పసికందు ఆరోగ్య పరిస్థితి పరిశీలించానని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఎలాంటి సమస్య లేదని తెలిపారు. ఫ్యాను ఊడిపడిన ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పారు.