- పర్యావరణ పరిరక్షణ దృష్టితో కేంద్రం ఆదేశాలు
- బొగ్గు నిల్వలు అయిపోతే మూసివేయాలనే రూల్
- రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో ఓపెన్, అండర్ గ్రౌండ్ మైన్స్
గోదావరిఖని, వెలుగు: కోల్ఇండియా, సింగరేణి పరిధిలో 141 డీ కోల్డ్మైన్స్ మూసివేతకు కేంద్రం ఆదేశించింది. ఇందుకు వచ్చే మూడేండ్లలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. బొగ్గును వెలికితీసిన ప్రాంతాల్లో తిరిగి పర్యావరణాన్ని మళ్లీ పెంపొందించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా.. సింగరేణికి చెందిన ఆరు జిల్లాల్లో ప్రస్తుతం 39 గనుల్లో బొగ్గు తవ్వకాలు చేస్తుండగా.. ఇందులో మూడు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్లు, ఆరు అండర్ గ్రౌండ్ మైన్లలో వచ్చే మూడేండ్లలో బొగ్గు నిల్వలు పూర్తవుతుండగా మూసివేతకు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
వీటిలో కొత్తగూడెంలోని జీకే ఓసీపీ, ఇల్లందు లోని జేకే ఓసీపీ 5, బెల్లంపల్లి ఓసీపీ 2, ఆర్జీ 3 ఏరియాలోని జీడీకే 10 ఇంక్లైన్, రవీంద్రఖని లోని ఆర్కే1ఏ ఇంక్లైన్, ఆర్కే 6 ఇంక్లైన్, ఆర్ కే 8 ఇంక్లైన్, మందమర్రిలోని కేకే 1 ఇంక్లైన్, కేకే 5 ఇంక్లైన్ మైన్స్ ఉన్నాయి.
డీ కోల్డ్ మైన్స్ అంటే..
లక్ష్యం మేరకు బొగ్గును తవ్విన తర్వాత మూసి వేయాల్సినవాటిని డీ కోల్డ్ మైన్స్ అంటారు. మైన్లను ప్రారంభిం చినప్పుడు అక్కడ ఎలాంటి పర్యావరణం ఉందో, మూసివేత తర్వాత కూడా తిరిగి అదేవిధంగా పెంపొందించా ల్సి ఉంటుంది. గనుల్లో బొగ్గును వెలికితీసిన తర్వాత కాలయాపన చేయకుండా డీ కోల్డ్మైన్గా డిక్లేర్చేసి పర్యావరణ చర్యలు చేపట్టాలి. ఇందుకు కోల్ఇండియా, సింగరేణి సంస్థలకు ఆదేశాలను కేంద్రం జారీ చేసింది. మూసివేసిన గనుల పరిధిలో చెట్లను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది.
డిపాజిట్ ఫండ్ తిరిగి పొందాలంటే..
అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్కాస్ట్ప్రాజెక్ట్లను ప్రారంభించాలంటే భారీగా భూమి కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా అటవీ విస్తరించిన ప్రాంతాల్లోనే బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వేలల్లో చెట్లను నరికిన తర్వాత భూమిని చదును చేస్తారు. అనంతరం కొన్నేండ్లపాటు అక్కడ బొగ్గును వెలికితీస్తారు. లక్ష్యం మేరకు బొగ్గు తీయడం పూర్తయిన తర్వాత తిరిగి ఆ ప్రాంతాన్ని యధాతథ స్థితికి తీసుకురావాలి.
ఇలా చేస్తామనే హామీతోనే ముందుగా బొగ్గు కంపెనీలు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వద్ద రూ. వందల కోట్లను డిపాజిట్గా పెడతాయి. డీ కోల్డ్ మైన్స్ పూర్వ స్థితికి తీసుకొచ్చి పర్యావరణం పెంపొందించిన తర్వాతే కేంద్రం రూల్స్ మేరకు డిపాజిట్సొమ్ము వాపస్వస్తుంది. దీని కోసమైనా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడతాయి. ఇదే ప్రక్రియ సింగరేణిలో ఉంది. అయితే కోల్ ఇండియా పరిధిలోని గనుల్లో బొగ్గు నిల్వలు అయిపోయాక మూసి వేయడం లేదు.
దీంతో వాటిలో ప్రైవేటు వ్యక్తులు ఇల్లీగల్మైనింగ్పనులు చేయిస్తుండగా.. చాలా మంది కార్మికులు ప్రమాదాలకు గురై మరణించిన ఘటనలు జరిగాయి. ఇలాంటివి మళ్లీ జరగకుండా బొగ్గు నిల్వలు పూర్తయిన వెంటనే గనుల మూసివేతకు, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలనే కఠిన నిబంధన లను కేంద్రం తెచ్చింది. ఇందులో భాగంగానే బొగ్గు నిల్వలు పూర్తయిన డీ కోల్డ్స్మైన్స్ను తప్పనిసరిగా మూసివేయాలని, ఇందుకు కోల్ఇండియా, సింగరేణి సంస్థలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
