ప్రగతి మీటింగ్​..‘పోలవరం’ అంశం గాయబ్​

ప్రగతి మీటింగ్​..‘పోలవరం’ అంశం గాయబ్​
  • పీఎంతో సమావేశానికి 2 రోజుల ముందు కీలక పరిణామం
  • ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారన్న ఆరోపణలు
  • ముంపుపై ముందు నుంచి అభ్యంతరం చెబుతున్న తెలంగాణ
  • మన వాదనలు వినిపిస్తే ప్రాజెక్టుకు నష్టమన్న యోచనలో ఏపీ

హైదరాబాద్​, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించనున్న ప్రగతి మీటింగ్​లో పోలవరం ముంపు అంశాన్ని ఎజెండా నుంచి కేంద్రం ఎత్తేసింది. బుధవారం నిర్వహించనున్న ప్రగతి మీటింగ్​లో తొలుత పోలవరం ముంపు అంశాన్నే ఎజెండాలో ఫస్ట్​ పాయింట్​గా కేంద్రం పేర్కొన్నది. కానీ, మీటింగ్​ 2 రోజులు ఉందనగా ఆ అంశాన్నే పక్కకు పెట్టేసింది. మీటింగ్​లో భాగంగా తెలంగాణతోపాటు ఏపీ, చత్తీస్​గఢ్​, ఒడిశా  అభిప్రాయాలను తీసుకోవాలని ప్రధాని భావించారు.  ఉన్నట్టుండి పోలవరం అంశాన్ని కేంద్రం తొలగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పి ఈ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించేలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలవరం బ్యాక్​ వాటర్​ ముంపుతో మనకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆది నుంచి తెలంగాణ వాదిస్తున్నది. అందుకు అనుగుణంగా ప్రధాని ముందు అభ్యంతరాలను తెలియజేసేందుకు మన అధికారులు ఎజెండా అంశాలనూ సిద్ధం చేశారు. పోలవరం ప్రాజెక్టును వాస్తవానికి 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. అయితే, ఆ ఎత్తుతో నిర్మించి పూర్తిస్థాయిలో నీటిని స్టోర్​ చేస్తే ప్రాజెక్ట్​ బ్యాక్​ వాటర్​తో ముంపు మరో 53,393 ఎకరాలు పెరిగే అవకాశం ఉంది.

దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరపగా.. ప్రాజెక్టును పూర్థిస్థాయి సామర్థ్యంతో నిర్మించినా.. కేవలం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్​ చేసుకునేలా కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా 15,277.84 ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఆ ఎత్తులోనూ నీటిని స్టోర్​ చేస్తే మన దగ్గర 6 మండలాల్లోని 954 ఎకరాలు ముంపునకు గురి కానున్నాయి. దాంతోపాటు భద్రాచలం టౌన్​, మణుగూరు హెవీ వాటర్​ ప్లాంట్​లకూ ముంపు ముప్పు పొంచి ఉంది. దాంతోపాటు కిన్నెరసాని, ముర్రేడువాగు, మరో ఆరేడు స్థానిక వాగుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది.

దుమ్ముగూడెం ప్రాజెక్టు కింద 36 వాగులు వచ్చి చేరుతుండడంతో పోలవరం బ్యాక్​ వాటర్​ వల్ల వాటి డ్రైనేజీ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఈ క్రమంలోనే ముంపునకు సంబంధించి కచ్చితంగా సర్వే చేయించి డీమార్కేషన్​ చేయించాలని తెలంగాణ పట్టుబడుతున్నది. కానీ, ఏపీ మాత్రం జాయింట్​ సర్వేకు అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ వాదనల్లో నిజం లేదని కొట్టిపారేస్తున్నది. ఇప్పుడు ప్రధాని వద్ద మన వాదన వినిపిస్తే.. ప్రాజెక్టుకు నష్టం కలుగుతుందన్న యోచనలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారన్న వాదనలు వినిపిస్తున్నాయి.