- కౌన్సిల్ రికమెండేషన్స్ నిర్బంధం కాదు
- సముద్ర రవాణా చార్జీలపై పన్ను కుదరదు: సుప్రీం కోర్టు
- గుజరాత్ హైకోర్టు తీర్పుకే సమర్థన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ చట్టాలు చేయడానికి సమానమైన అధికారాలుంటాయనే తాజా సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసే జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు వాటిపై నిర్బంధమేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలు తలెత్తేందుకు ఆస్కారం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) పై చట్టాలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమానమైన అధికారాలు ఉంటాయని సుప్రీం కోర్టు గురువారం తీర్పు చెప్పింది. జీఎస్టీ కౌన్సిల్ రికమండేషన్స్ మాత్రమే చేయగలుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిర్బంధించలేదని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్రాలను ఒకే తాటిపైకి తెచ్చేలా మాత్రమే జీఎస్టీ కౌన్సిల్ పనిచేస్తుందని పేర్కొంది. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల అధికారాలను ఈ తీర్పు మరోసారి నిర్వచించినట్లయింది. 2017 లో తెచ్చిన జీఎస్టీ చట్టంలో తిరస్కరణ నిబంధనలు లేవని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అభిప్రాయాల్లో తేడా వచ్చినప్పుడు జీఎస్టీ కౌన్సిల్ చొరవ తీసుకుని పరిష్కరించాలని సుప్రీం కోర్టు బెంచ్ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య సమన్వయం కుదిరేలా జీఎస్టీ కౌన్సిల్ బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పుపై కేసు విచారణకు రావడంతో సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది. అంతకు ముందు అమలులో ఉన్న ఒక పన్నుని మినహాయించి, తర్వాత తిరిగి విధించడాన్ని కొట్టివేసింది. దిగుమతిదారులపై ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (ఐజీఎస్టీ) విధించేందుకు అధికారం లేదని 2020లో గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పరాయి భూభాగంపై నుంచి అందిస్తున్న సేవలపై ఇక్కడ పన్ను విధించడం సమంజసం కాదని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. ఇప్పుడు సుప్రీం కోర్టు.. గుజరాత్ హైకోర్టు తీర్పుని సమర్థించింది. ఓషన్ ఫ్రైట్ (సముద్ర రవాణా చార్జీలు)పై ఐజీఎస్టీ విధించడాన్ని మోహిత్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చాలెంజ్ చేస్తూ ఈ కేసును వేసింది. ఓడలో సరుకు రవాణా సేవలపై 5 శాతం ఐజీఎస్టీ విధిస్తూ 2017 లో కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ను తెచ్చింది. గుజరాత్ హైకోర్టు ఈ నోటిఫికేషన్ చెల్లదంటూ కొట్టివేసింది.