
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్లో మాక్ డ్రిల్ నిర్వహించింది. ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి, సిబ్బంది, టెస్టింగ్ కెపాసిటీ, మెడికల్ లాజిస్టిక్స్, టెలి మెడిసిన్, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు వెంటిలేటర్లు వంటి కీలక అంశాలను పరిశీలించారు.
కేసులు పెరిగితే రోగులకు అందే వైద్య సేవలపై మాక్డ్రిల్ చేపట్టింది. ఢిల్లీలోని లోక్నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) హాస్పిటల్లో నిర్వహించిన మాక్డ్రిల్లో డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియా పాల్గొన్నారు. 2 వేల పడకల హాస్పిటల్లో 450 బెడ్లు కరోనా కోసం కేటాయించామని తెలిపారు. ఇవి సరిపోకపోతే హాస్పిటల్కు దగ్గర్లోని బాంకెట్హాల్స్లో 500 బెడ్స్ అదనంగా ఏర్పాటు చేస్తామని, దీంతో బెడ్స్ కొరత ఉండదన్నారు. మాక్డ్రిల్ సక్సెస్ అయ్యిందని ఎల్ఎన్జేపీ హాస్పిటల్ ఎండీ సురేశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
లోపాలుంటే సరిచేసుకోవచ్చు: మాండవీయ
సఫ్దర్ జంగ్ హాస్పిటల్లో నిర్వహించిన మాక్డ్రిల్లో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. అక్కడి సౌలత్ల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు డాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఇలా డ్రిల్ చేపట్టడంతో తాము ఎంత వరకు రెడీగా ఉన్నామో తెలుస్తుందని, లోపాలు ఉంటే సరిచేసుకోవచ్చని మాండవీయ తెలిపారు.