- కరెంట్ డిమాండ్ పెరగడమే కారణం
న్యూఢిల్లీ: కరెంటుకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 30 వరకు అన్ని గ్యాస్ ఆధారిత కరెంట్ఉత్పత్తి కేంద్రాలు తమ ప్లాంట్లను నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్యాస్- బేస్డ్ జనరేటింగ్ స్టేషన్లలో (జీబీఎస్) చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. వాణిజ్యపరమైన కారణాలతో ఇవి మూతపడే ఉన్నాయి. ఈ వేసవిలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) 260 గిగావాట్ల గరిష్ట కరెంట్ డిమాండ్ ఉండొచ్చని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. గత ఏడాది సెప్టెంబర్లో గరిష్ట కరెంట్ డిమాండ్ 243 గిగావాట్ల ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.
వేసవిలో కరెంట్ డిమాండ్ను తీర్చేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే జీబీఎస్లను తెరిపించాలనే నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విద్యుత్మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, మే 1, 2024 నుంచి జూన్ 30, 2024 వరకు కరెంట్ ఉత్పత్తి సరఫరా కోసం ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. గ్యాస్ ఆధారిత ఉత్పాదక కేంద్రాల నుంచి గరిష్ట కరెంట్ ఉత్పత్తిని తీయడానికి, విద్యుత్ చట్టం, 2003లోని సెక్షన్ 11ను ప్రయోగించామని సంబంధిత అధికారులు తెలిపారు.
దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత కరెంట్ ప్లాంట్ల మాదిరిగానే అధిక డిమాండ్ కాలంలో జీబీఎస్ల నుంచి కూడా కరెంట్ లభ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్యాస్ ఆధారిత కరెంట్ ఎన్ని రోజులకు అవసరమో గ్రిడ్ఇండియా ముందుగానే జీబీఎస్లకు తెలియజేస్తుంది.