
న్యూఢిల్లీ : ఆడిట్ ఫర్మ్స్ రూల్స్ను మరింత కఠినం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆడిట్ చేసే లిస్టెడ్ కంపెనీల సంఖ్యపై పరిమితి విధించాలనుకుంటోంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ మొదలు అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ దాకా వైఫల్యాలను చూసిన తర్వాత నిబంధనలను కఠినం చేయక తప్పదనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో ట్రేడవుతున్న మొత్తం 1800 కంపెనీలలో 70 శాతం కంపెనీలకు ఈవై, డెలాయిట్ అండ్ టచ్, కేపీఎంజీ, పీడబ్ల్యూసీల ఎఫిలియేటెడ్ సంస్థలే ఆడిటర్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రైమ్ డేటాబేస్ వెల్లడిస్తోంది. వ్యక్తిగత ఆడిటర్లైతే ఒక్కొక్కరు 20 కంపెనీల దాకా ఆడిట్ చేయొచ్చని ప్రస్తుత నిబంధనలను నిర్దేశిస్తున్నాయి. ఐతే, ఆడిట్ ఫర్మ్స్ మీద ఇలాంటి పరిమితులేవీ ఇప్పుడు లేవు.
బిగ్ ఫోర్గా పేరొందిన నాలుగు మల్టీ నేషనల్ ఆడిట్ ఫర్మ్స్ కూడా ఇండియాలోని లోకల్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఫర్మ్స్తో కలిసి పనిచేస్తున్నాయి. లోకల్ ఫర్మ్లోని మెంబర్లు సబ్–లైసెన్స్ ద్వారా తమ బ్రాండ్ నేమ్ వాడుకోవడానికీ వీలు కల్పిస్తున్నాయి ఈ బిగ్ ఫోర్ ఆడిట్ ఫర్మ్స్. ఐతే, కేంద్ర ప్రభుత్వం విధించే పరిమితి ఫర్మ్లోని ఒక్కో మెంబర్పైనా లేదా గ్రూప్ స్థాయిలోనా అనేది ఇంకా కార్పొరేట్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఖరారు చేయలేదని తెలుస్తోంది. కంపెనీల చట్టం కింద స్టాట్యుటరీ ఆడిటర్లుగా నియమితులైన వారు ఏయే సర్వీసులు ఇవ్వకూడదనే జాబితాను మరింత పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. స్టాట్యుటరీ ఆడిటర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రస్తుతం 9 సర్వీసులు అందించడానికి వీలు లేదు. ఇంటర్నల్ ఆడిట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, యాక్ట్యుయేరిల్ సర్వీసెస్ వంటివి అందులో ఉన్నాయి. టాక్సేషన్, రీస్ట్రక్చరింగ్, వ్యాల్యుయేషన్ వంటి సర్వీసులను అందించడం మీద ఎలాంటి పరిమితులు లేవు. నాన్ ఆడిట్ సర్వీసుల మీద వసూలు చేసే ఫీజు మార్చడం కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉందని కార్పొరేట్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. నాన్ ఆడిట్ సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం స్టాట్యుటరీ ఆడిట్ ఫీజు కంటే ఎక్కువగా ఉండరాదని 2002 లో నిబంధన విధించారు. ఐతే, ఈ అంశాన్ని అధ్యయనం చేసిన గవర్నమెంట్ పానెల్, స్టాట్యుటరీ ఆడిట్ పీజులో 50 శాతానికి మించి నాన్ ఆడిట్ సర్వీసుల ఆదాయం ఉండరాదనే నిబంధనను ప్రతిపాదించింది.