పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, ఏపీకి, కేంద్ర జలసంఘం ఆదేశాలు జారీ చేసింది. పోలవరంపై అభ్యంతరం తెలుపుతున్న రాష్ట్రాలతో ఏప్రిల్ 3న మధ్యాహ్నం సెంట్రల్ వాటర్ కమీషన్ సమావేశం అయ్యింది. సమావేశానికి ఏపీ, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. పోలవరం ముంపుతో పాటు, పునరావాసం, ఇతర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సంయుక్త సర్వే నిర్వహణ నిర్లక్షంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర జలసంఘం. తెలంగాణ ఒత్తిడితో అధ్యయనానికి నియమిత కాలపరిమితి విధిస్తూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది వాటర్ కమిషన్. ఏప్రిల్ 10 న ఏపీ, తెలంగాణతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేసింది.