రిజిస్ట్రేషన్ లేకుండానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు

రిజిస్ట్రేషన్ లేకుండానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు

దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా టీకాలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే.. చాలా ప్రాంతాల్లో టీకా డోసులు ముందుగా బుక్ చేసుకుని, తమకు నిర్దేశించిన రోజున వారు రాకపోవడంతో ఆ డోసులు వృథా అవుతున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా.. నేరుగా వ్యాక్సిన్ కేంద్రాల దగ్గరకు వెళ్లి డోసులు వేయించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గరే అప్పటికప్పుడే( ఆన్ సైట్) తమ పేరు.. ఇతర వివరాలు నమోదు చేయించుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపింది. ఇంటర్నెట్ సదుపాయం లేని వారు..మొబైల్ ఫోన్స్ ఉపయోగించడం తెలియని వారి కూడా ఈ ఆన్ సైట్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. 

అయితే..ఇది తమ నిర్ణయం మాత్రమేనని, దీన్ని అమలు చేసే విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్వేచ్ఛ ఇచ్చామని కేంద్రం తెలిపింది. ఒకవేళ రాష్ట్రాలు తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే.. ఈ ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ కేవలం ప్రభుత్వ కరోనా సెంటర్ల దగ్గరే అమలు చేయాలని, ప్రైవేటు టీకా కేంద్రాల దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్లు చేపట్టవద్దని స్పష్టం చేసింది.