
- లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లో తొలుత జనగణన
- 2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి ప్రారంభం
- 2027, మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లెక్కింపు
- 15 ఏండ్ల తర్వాత జనగణన చేపడుతున్న ప్రభుత్వం
- స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి కులగణన
న్యూఢిల్లీ: జనగణనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనగణన చేపడ్తారు. 2027, మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తారు. సోమవారం ఉదయం హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంతజయ్ నారాయణ్తో పాటు పలువురు సీనియర్ అధికారులతో హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. జనగణన ఏర్పాట్లపై సమీక్ష చేసి.. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఇది 16వ జనగణన కాగా, స్వాతంత్ర్యం వచ్చాక జరుగుతున్న 8వ జనగణన. చివరి సారిగా 2011లో జనగణన చేపట్టారు. లెక్క ప్రకారం.. 2021లో జనగణన చేపట్టాలి. కానీ.. కరోనా కారణంగా వాయిదా వేశారు. దీంతో 15 ఏండ్ల తర్వాత జనగణన జరుగుతున్నది.
డిజిటల్ రూపంలో జనాభా లెక్కింపు
ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ రూపంలో జరగబోతున్నది. టాబ్లెట్ల ద్వారా డేటా సేకరిస్తారు. ప్రభుత్వం అందించే పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నది. ఇందుకోసం 16 భాషలతో కూడిన మొబైల్ యాప్లను రెడీ చేస్తున్నారు. డేటా మాత్రం సేఫ్గా ఉంటుందని హోంశాఖ భరోసా ఇచ్చింది. జనగణనలో జనాభాతో పాటు కుల గణన కూడా చేపడ్తారు. జనాభా లెక్కల సేకరణ కోసం 30కి పైగా ప్రశ్నలను కేంద్రం సిద్ధం చేసింది. ప్రతీ రాష్ట్రంలో 2 దఫాల్లో జనగణన నిర్వహిస్తున్నట్లు హోంశాఖ అధికారులు ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభా 121 కోట్లు. ఇందులో 62.27 కోట్ల మంది (51.54 శాతం) పురుషులు ఉండగా.. 58.64 కోట్ల మంది (48.46 శాతం) స్త్రీలు ఉన్నారు. కాగా, 2027 జన గణనలో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే కాకుండా ఓబీసీలు సహా అన్ని కులాలను కవర్ చేసేలా కులగణన ఉండనున్నది.
జనగణన ఖర్చు ఎంత?
జనగణన కోసం 34 లక్షల మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. 2025–26 బడ్జెట్లో జనగణన కోసం రూ.574.80 కోట్లు కేటాయించారు. అయితే, మొత్తం ఖర్చు రూ.13,000 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 1,800 మంది మాస్టర్ ట్రైనర్లు.. 45వేల మంది ఫీల్డ్ ట్రైనర్లకు జనగణనపై శిక్షణ ఇస్తారు. వీళ్లు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ జనగణన రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం.. ఏడో షెడ్యూల్లోని కేంద్ర జాబితాలో 69వ అంశంగా జాబితా చేశారు. కుల గణన చేపట్టడం స్వాతంత్ర్యం తర్వాత ఇదే తొలిసారి. చివరి సమగ్ర కుల ఆధారిత లెక్కింపు.. 1881, 1931 మధ్య జరిగింది. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా కులాల వారీగా లెక్కలు తీయలేదు.
ఫస్ట్ ఫేజ్లో..
హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్వో) నిర్వహిస్తారు. ఇందులో ప్రతీ ఇంటి కండీషన్ ఎలా ఉంది? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఇంట్లో ఉన్న సౌలత్లకు సంబంధించిన డేటాను సేకరిస్తారు.
సెకండ్ ఫేజ్లో..
పాపులేషన్ ఎన్యుమరేషన్ (పీఈ) చేపడ్తారు. ఈ స్టెప్లో ఒక్కో ఇంట్లో ఎంత మంది నివాసం ఉంటున్నారు? సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏంటి? ప్రతి వ్యక్తి కల్చరల్ డీటెయిల్స్ సేకరిస్తారు. ఈ ఫేజ్లోనే సదరు వ్యక్తి కులం తెలుసుకుంటారు. క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఒక్కో కుటుంబంలో ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి డిజిటలైజ్ చేస్తారు.