కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల్లో ఓట్ల పోలింగ్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటేసే అవకాశం ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులు, దివ్యాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన పౌరులకు మాత్రమే కల్పించేది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులకు దాని ముప్పు ఎక్కువని చెబుతున్న నేపథ్యంలో 65 ఏళ్లు పైబడిన వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే వీలును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు, కరోనా అనుమానితులు, క్వారంటైన్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ను వాడుకొనేలా రూల్స్ మార్చింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ రూల్స్, 1961లోని పలు క్లాజ్లను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరికి ఇవ్వొచ్చన్న దానికి సంబంధించి రూల్ – 27(ఏ)లోని వేర్వేరు క్లాజుల్లో పొందుపరిచి ఉంది. వాటిలో ఉన్న దివ్యాంగులు అన్న పదానికి అదనంగా కరోనా అనుమానితులు, పాజిటివ్ వచ్చిన పేషెంట్లు, క్వారంటైన్లో ఉన్నవారు అన్న పదాలను, 80 ఏళ్ల వయసు అన్న పదం ప్లేస్లో 65 ఏళ్లు అని చేర్చింది కేంద్ర ప్రభుత్వం.
ఈ ఏడాది చివరిలో బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగాల్సి ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటింగ్ విషయంలో ఈ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారు బయటకువచ్చి ఓటు వేయడం ద్వారా ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.