న్యూఢిల్లీ: దేశంలో వంట నూనెల రేట్లను కిందకి తెచ్చే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీలను తగ్గించింది. రిఫైన్డ్ సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్స్పై డ్యూటీని ఇప్పుడున్న 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ తగ్గింపును గురువారం నుంచే అమలులోకి తెచ్చారు. సాధారణంగా సోయాబీన్ క్రూడ్, సన్ఫ్లవర్ క్రూడ్లనే మన దేశం దిగుమతి చేసుకుంటోంది. రిఫైన్డ్ ఆయిల్స్ దిగుమతులు తక్కువే.
అయినా, రిఫైన్డ్ ఆయిల్స్పై డ్యూటీని ప్రభుత్వం కిందకి తెచ్చింది. తాజా తగ్గింపుతో రిఫైన్డ్ వంట నూనెలపై ఎఫెక్టివ్ డ్యూటీ 13.70 శాతానికి తగ్గినట్లవుతుంది. డ్యూటీ తగ్గింపు ప్రభావం మార్కెట్ సెంటిమెంట్పై తాత్కాలికంగానే ఉంటుందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ వీ మెహతా చెప్పారు. ఈ తగ్గింపు వల్ల దిగుమతులు ఆకర్షణీయంగా మారకపోవచ్చని పేర్కొన్నారు. దేశంలో వంట నూనెల రేట్లు దిగి రావాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ తగ్గింపు కూడా ఆ దిశలో తీసుకున్న చొరవేనని మెహతా వివరించారు.
కేరళకు రుతుపవనాల రాక ఆలస్యమవుతున్న నేపథ్యంలో విత్తనాల నాట్లు వేయడమూ ఆలస్యమవుతోందని ఎస్ఈఏ తెలిపింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉండొచ్చని ఐఎండీ అంచనా వేస్తున్నా, ఎల్నినో అవకాశాలను తోసిపుచ్చలేమని, అదే జరిగితే 2023–24 ఆయిల్ ఇయర్లో దేశంలోని వంట నూనెల సాగుపై ఆ ఎఫెక్ట్ పడుతుందని మెహతా వెల్లడించారు.
