
న్యూఢిల్లీ: కెవ్లార్, స్పాండెక్స్ వంటి సాంకేతిక వస్త్రాలను తయారు చేయగల 150 స్టార్టప్లకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ రూ. 50 లక్షల వరకు గ్రాంట్లు ఇవ్వాలని యోచిస్తోందని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే వీటి వ్యాపారం నుంచి వచ్చే లాభాలలో మంత్రిత్వ శాఖ ఎటువంటి వాటాను కోరబోదని చెప్పారు. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.375 కోట్ల కేటాయింపులో ఈ నిధులు భాగం. కెవ్లార్, స్పాండెక్స్, నోమెక్స్, ట్వారన్ వంటి సాంకేతిక వస్త్రాలను ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్స్, హెల్త్కేర్, కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్ వంటి రంగాలలో వాడుతారు. కేపీఎంజీ రిపోర్ట్ నివేదిక ప్రకారం, భారతీయ సాంకేతిక వస్త్రాల మార్కెట్ ప్రపంచంలో 5వ అతిపెద్దది. 2021–-22లో దీని విలువ 21.95 బిలియన్ల డాలర్లు ఉంది. గ్లోబల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మార్కెట్ 2022లో 212 బిలియన్ల డాలర్లుగా అంచనా వేశారు. ఇది 2027 నాటికి 274 బిలియన్ల డాలర్లకు చేరుతుందని అంచనా.