సాగును కాటేస్తున్న ‘రసాయన’ మాఫియా.. నకిలీ పురుగు మందుల తయారీదారులకు ఇక మూడినట్టే !

సాగును కాటేస్తున్న ‘రసాయన’ మాఫియా.. నకిలీ పురుగు మందుల తయారీదారులకు ఇక మూడినట్టే !

ప్రకృతి  వైపరీత్యాలు ఒకవైపు, మార్కెట్ మాయాజాలం మరోవైపు వీటికితోడు  నకిలీ  విత్తనాలు  రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అదే విధంగా నకిలీ పురుగు మందుల రసాయన విషం సాగును లోపల నుంచే మెల్లగా చంపేస్తోంది. పంటను కాపాడాలన్న రైతు ఆందోళననే  పెట్టుబడిగా  మార్చుకుని,  రసాయన మాఫియా లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఈ ప్రమాదకర దందాకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక  ముందడుగు వేసింది.  కాలం చెల్లిన పాత చట్టాల స్థానంలో పురుగు మందుల నిర్వహణ బిల్లు–2025ను  ప్రతిపాదించి, నకిలీ పురుగు మందుల తయారీదారుల ఆట కట్టించేందుకు రంగం సిద్ధం చేసింది.

విస్తరిస్తున్న నకిలీ వ్యాపార సామ్రాజ్యం
నేటి  వ్యవసాయంలో పురుగు మందుల  వినియోగం ఒక అవసరం కాదు. రైతుకు ఒక అత్యవసర పరిస్థితిగా మారిపోయింది. పంటలో చిన్న తెగులు, పురుగు కనిపించినా.. మొత్తం పంట నాశనం అవుతుందేమో అన్న భయం రైతును వెంటాడుతోంది. అదే భయాన్ని అవకాశంగా మలుచుకుని, కొన్ని కంపెనీలు నాణ్యత లేని రసాయనాలను ఆకర్షణీయమైన ప్యాకింగ్‌‌లతో మార్కెట్లోకి నెట్టేస్తున్నాయి.  నిపుణుల అంచనాల ప్రకారం, దేశంలో ఏటా రూ.6,000–8,000 కోట్ల  వరకు  నకిలీ  పురుగు మందుల వ్యాపారం సాగుతోంది.  రైతుపెట్టే  పెట్టుబడిలో దాదాపు 25 శాతం  నేరుగా  నష్టంగా  మారుతోందన్నది చేదు నిజం.

నకిలీల కాటుతో వ్యవస్థకే ముప్పు 
నకిలీ పురుగు మందుల  ప్రభావం  కేవలం  రైతాంగంపైనే చూపి  ఆగిపోవడం లేదు.  వ్యవసాయ వ్యవస్థ  మొత్తం దీనివల్ల దెబ్బతింటోంది.   రోగాలు  తగ్గకపోగా  పంట ఎండిపోవడం,  పెరుగుదల  ఆగిపోవడం దిగుబడులు పడిపోవడంతో  రైతు  అప్పుల  ఊబిలోకి  జారుకోవడం.  భూసారం క్రమంగా నాశనం కావడం  భూగర్భజలాలు,  పర్యావరణం కలుషితం కావడం ఇవే కాకుండా,  పిచికారీ  సమయంలో  సరైన రక్షణ లేకపోవడం వల్ల రైతుల్లో శ్వాసకోస వ్యాధులు,  చర్మ సమస్యలు పెరుగుతున్నాయి.  

చివరికి ఆ విష పదార్థాలే మన ఆహారంలోకి చేరి సామాన్యుడి ఆరోగ్యానికీ ముప్పుగా మారుతున్నాయి.. ప్రస్తుతం అమల్లో ఉన్న 1968 నాటి కీటక నాశిని చట్టం నేటి పరిస్థితులకు సరిపోవడం లేదు.  నామమాత్రపు జరిమానాలు, బలహీన శిక్షలు నకిలీ మాఫియాకు ఎలాంటి భయం కలిగించలేకపోయాయి. ఈ లోపాలను సరిదిద్దేందుకే కేంద్ర ప్రభుత్వం  పురుగుమందుల నిర్వహణ బిల్లు–2025ను  తీసుకొచ్చింది.  ఈ బిల్లుపై  ఫిబ్రవరి 4లోపు అభిప్రాయాలు,  సూచనలు పంపాలని  కేంద్రం కోరింది.

కఠిన చట్టం.. రైతుకు రక్షణ కవచం
వ్యవసాయ రంగంలో తిష్టవేసిన నకిలీ మాఫియా  అంతానికి  ప్రభుత్వం సిద్ధం చేసిన ఈ నూతన నిబంధనలు అన్నదాతకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా.. నకిలీ లేదా నిషేధిత  పురుగు మందుల తయారీ,  విక్రయాలే లక్ష్యంగా  విధిస్తున్న రూ. 50 లక్షల గరిష్ఠ జరిమానా,  ఐదేళ్ల   జైలుశిక్ష వంటి  నిబంధనలు  అక్రమార్కుల  గుండెల్లో  రైళ్లు  పరుగెత్తిస్తున్నాయి.  ఇది కేవలం శిక్ష మాత్రమే కాదు,  నకిలీల  సామ్రాజ్యాన్ని వేళ్లతో సహా పెకిలించే గట్టి హెచ్చరిక.  

'క్యూఆర్ కోడ్'  ఆధారిత  ట్రేసిబిలిటీ వ్యవస్థ ద్వారా ప్రతి బాటిల్ ప్రయాణాన్ని తయారీ కేంద్రం నుంచి  రైతు పొలం వరకు డిజిటల్ పద్ధతిలో  ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. ఈ సాంకేతిక అడ్డుకట్టతో సరఫరా గొలుసులో  నకిలీలు ప్రవేశించే అవకాశమే లేకుండా పోతుంది.  నాణ్యత లేని మందుల వల్ల పంట నష్టపోతే,  రైతు కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నేరుగా కంపెనీల నుంచే పరిహారం పొందే వెసులుబాటు కల్పించడం  ఒక  విప్లవాత్మక మార్పు.

ఇది రైతుకు ఆర్థిక భరోసాతో పాటు చట్టబద్ధమైన రక్షణను నిర్ధారిస్తుంది.  కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లు,  తయారీదారుల  లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసే అధికారం అధికారులకు ఇవ్వడం అభినందనీయం.  ఈ చర్య  వ్యవసాయ ఇన్‌‌పుట్ల రంగంలో  జవాబుదారీతనాన్ని పెంచి,  నైతిక విలువలతో  కూడిన  వ్యాపారానికి మార్గం  సుగమం చేస్తుంది.

అప్రమత్తతే  రైతును కాపాడేది
నకిలీ విత్తనాలు,  కల్తీ ఎరువుల నియంత్రణకు చట్టాలు ఎన్ని కఠినంగా రూపొందించినప్పటికీ,  క్షేత్రస్థాయిలో రైతు అప్రమత్తతే అన్నింటికన్నా బలమైన రక్షణ కవచం.  ప్రతి కొనుగోలులోనూ పారదర్శకత ఉండాలి. కంపెనీ పేరు, బ్యాచ్ సంఖ్య  స్పష్టంగా నమోదైన 'పక్కా బిల్లు' తీసుకోవడం రైతు బాధ్యత మాత్రమే కాదు, మోసపోతే పోరాడేందుకు ఒక ఆయుధం కూడా.  డీలర్ల  వ్యాపార  ప్రయోజనాలకు  ప్రభావితం కాకుండా,  వ్యవసాయాధికారుల శాస్త్రీయ సలహాలకు పెద్ద పీట వేయాలి. 

అనవసర రసాయన ప్రయోగాలతో సాగును సంక్షోభంలోకి నెట్టుకోకుండా విజ్ఞతతో వ్యవహరించాలి. ఎక్కడ నకిలీల ఆనవాళ్లు కనిపించినా, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తనతోపాటు తోటి రైతుల ప్రయోజనాలను కాపాడే సామాజిక బాధ్యతను ప్రతి కర్షకుడు స్వీకరించాలి. అన్నదాతను పట్టి పీడిస్తున్న నకిలీల బెడదను అరికట్టడం వ్యవస్థల కర్తవ్యమే కాదు, సామాజిక బాధ్యత కూడా.  రైతుకు  ఆర్థిక భరోసా  కల్పించినప్పుడే సాగు లాభసాటిగా మారుతుంది.

జి. అజయ్ కుమార్, వ్యవసాయ నిపుణుడు