
- జూబ్లీహిల్స్లో బీజేపీ, బీఆర్ఎస్వి ఓటు చోరీ రాజకీయాలు
- మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : హరియాణాకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ పూరన్కుమార్ ఆత్మహత్యపై కేంద్ర ప్రభుత్వంతో పాటు హరియాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్లో బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన డైరీలో పేర్లు రాసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. డీజీపీని మార్చినంత మాత్రాన సరిపోదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మృతుడి భార్య, ఐఏఎస్ ఆఫీసర్ వారం రోజులుగా భర్త మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచి న్యాయం కోరుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ‘ఓటు చోరీ’ రాజకీయాలకు తెరలేపాయని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
రాజకీయ లబ్ధి కోసమే సునీత కంట కన్నీరు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, రెండేండ్లలో తాము చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.
సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్టీఏ సభ్యుడు సూర్యవర్మ, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు పూజల హరికృష్ణ, మంజులారెడ్డి పాల్గొన్నారు.