
- ప్రజా వ్యతిరేకతను మళ్లించడానికే ‘జమిలి’
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి
హనుమకొండ: ప్రభుత్వం అందించే ఇండ్లు, రేషన్ కార్డుల సంక్షేమ పథకాల విషయంలో కండీషన్లు పెట్టకండి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రజల వ్యతిరేకతను మళ్లించడానికే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రకటన చేసిందన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో జరిగిన ప్రెస్ మీట్ లో చాడ మాట్లాడారు. ‘సర్కారియా కమిషన్ సిఫారసులు మర్చిపోవద్దు. జమిలి ఎన్నికల నినాదాలు వెనక్కి తీసుకోవాలి. హైడ్రా అభినందనీయమే. కానీ నిరుపేదలపై జులూం చూపించకుండా వారికి ప్రత్యామ్నాయం చూపాలి.
దేవాదులకు మోక్షం లేదు. పనులు పూర్తయ్యేలా పారదర్శకత చూపించాలి. ఎల్కతుర్తి– సిద్దిపేట రోడ్డు నాణ్యతా ప్రమాణాలపై మంత్రి కోమటిరెడ్డికి ఫిర్యాదు చేస్తం. ఈనెల 26న ధర్నా కార్యక్రమం ఉంటుంది. పంచాయతీ చేసిన పనులకు మిగిలిన బకాయిలు తక్షణమే చెల్లించాలి. కులగణన సత్వరమే పూర్తి చేయాలి. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలి. 73,74 రాజ్యాంగ సవరణ స్ఫూర్తి జరగాలి. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమే కాదు ఆయన ఆలోచనలు ఆచరణలో చూపాలి. డిసెంబర్ 26 నుంచి సీపీఐ శతజయంతి ఉత్సవాలు జరుపుతం’ అని చాడ తెలిపారు.