
చీరాల: కేసీఆర్, ఆయన గురువు మోదీ, జగన్ కలిసి వస్తే ముగ్గుర్నీ కలిపి బంగాళాఖాతంలో పడేస్తామని అన్నారు సీఎం చంద్రబాబు. చీరాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ, కేసీఆర్, జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఒక గిఫ్ట్ పంపితే… తాను వంద పంపుతానన్నారు. మనల్ని అవమానించిన మోదీతో జగన్, కేసీఆర్ లాలూచీ పడ్డారని ఎద్దేవా చేశారు.ఏపీలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో తానే అభ్యర్థినని అన్నారు చంద్రబాబు. చీరాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు తనను చూసి ఓటు వేసి.. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ గెలిస్తే రాష్ట్రం గెలిచినట్లేనని అన్నారు. 40 వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోన్ ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆమంచి పై 28 కేసులున్నాయని..జగన్ తో పోటీపడుతున్నాడని విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే ఇలాంటి వాళ్లకు లైసెన్స్ ఇచ్చినట్టేనని అన్నారు చంద్రబాబు.
‘‘జగన్ ఆర్థిక ఉగ్రవాది, ఆయనపై 31 కేసులున్నాయి. వైసీపీ దొంగల పార్టీ. అవినీతిపరులను కాపాడటమే మోదీ పని. ప్రజల కోసమే నా పోరాటం. కేసీఆర్ మనకు నీళ్లు రానివ్వకుండా చేస్తున్నాడు. గోదావరి, కృష్ణా నదులను కలిపాను. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నాదే. ప్రత్యేక హోదా ఇస్తామని కేసీఆర్ జగన్ చెవిలో చెప్పారా. పోలవరంపై సుప్రీంకోర్టులో కేసీఆర్ రిట్ ఎందుకు వేశారు?. పోలవరంపై కేసులు వేయడానికి మీరెవరు?. కేసీఆర్.. జగన్కి వెయ్యి కోట్లు పంపించారు. జగన్, కేసీఆర్ ప్రజా ద్రోహులు. ఉచితంగా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం. కేసీఆర్ చెప్పిన డబుల్బెడ్రూమ్లు ఎక్కడ?. కేసీఆర్ పసుపు-కుంకుమ ఇవ్వలేదు. నీళ్లు లేని అనంతపురానికి కియా మోటార్స్ తెచ్చాం. పేదల విదేశీ విద్య కోసం రూ.20 లక్షలు ఇస్తాం. మోదీ రాష్ట్రంపై గద్దలా వాలిపోయారు. ప్రశ్నిస్తే మోదీ..ఐటీ దాడులు చేయిస్తున్నారు. మోదీ పతనావస్థకు చేరుకుంటున్నారు. ’’ అని చంద్రబాబు అన్నారు.