
భద్రాచలం, వెలుగు: జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. జార్ఖండ్లోని జార్ఖండ్ జనముక్తి పరిషత్కు చెందిన నక్సల్స్ కమాండర్లు గుమ్లా జిల్లాలోని అడవుల్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎస్పీ హరీశ్ బిన్ ఆధ్వర్యంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు.
బిషన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్కీ అడవుల్లో వీరి జాడను గుర్తించిన పోలీసులు.. లొంగిపోవాలంటూ మావోయిస్టులను హెచ్చరించారు. కానీ వారు ఓపెన్ ఫైర్ చేయడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47లతో పాటు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అడవిలోకి పారిపోయిన మిగతా మావోయిస్టులు కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు.
మరోవైపు చత్తీస్గఢ్ నారాయణ్ పూర్ జిల్లా అబూజ్మాడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు నారాయణ్ పూర్ ఎస్పీ రాబిన్సన్ తెలిపారు.
దంతెవాడలో లొంగిపోయిన 71 మంది మావోయిస్టులు..
చత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో బుధవారం 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ డీఐజీ కమలోచన్ కశ్యప్, ఎస్పీ గౌరవ్ రాయ్, సీఆర్పీఎఫ్ ఎస్పీ రాజేశ్ చౌదరిల సమక్షంలో ఘర్ వాపసీ అనే కార్యక్రమం ద్వారా వీరు సరెండర్ అయ్యారు.
వీరికి పునరావాస పథకం కింద రూ.50 వేల చొప్పున అందజేశారు. లొంగిపోయిన వారిలో 30 మందిపై రూ.64 లక్షల రివార్డు ఉంది. సరెండర్ అయిన వారిలో 21 మంది మహిళా, 50 మంది పురుష మావోయిస్టులు ఉన్నారు.
బామన్ మడకం, సమిలా, గంగే, దేవె, జోగా వంటి ముఖ్య మావో నేతలు సరెండర్ అయ్యారు. రోడ్లు తవ్వడం, చెట్లు నరికి రోడ్లకు అడ్డంగా పడేయడం, ఇన్ఫార్మర్ల పేరుతో పలువురి హత్య, భద్రతా బలగాలపై దాడులు వంటి అనేక ఘటనల్లో వీరు కీలకంగా వ్యవహరించారు.