బషీర్ బాగ్, వెలుగు : ఆన్ లైన్ లో పార్ట్ టైం జాబ్స్ పేరిట టాస్క్లు ఇస్తూ ఓ వ్యక్తి వద్ద సైబర్ క్రిమినల్స్ రూ.లక్షలు కాజేశారు. వాట్సాప్ ద్వారా బాధితుడికి పరిచయమైన సైబర్ ఫ్రాడ్స్ తాము ఇచ్చే టాస్క్లను పూర్తి చేస్తే అధిక లాభాలు ఇస్తామని నమ్మించారు. యూట్యూబ్ వీడియోలు చూడాలని, గూగుల్ లో రివ్యూలు ఇవ్వాలని చెప్పారు.
మొదట కొద్ది మొత్తాల్లో లాభాలు ఇస్తూ నమ్మించారు. తర్వాత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేలా ప్రేరేపించారు. దీంతో బాధితుడు రూ.10 లక్షల 85 వేలు ఇన్వెస్ట్ చేశాడు. తిరిగి డబ్బులను తీసుకునేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. చూస్తే విత్ డ్రా ఆప్షన్ బ్లాక్ చేసినట్టు ఉంది. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.