
- సాయికుంటలో ఓ ఇంట్లోకి చొరబాటు
- స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు
- తృటిలో తప్పించుకొని రైల్వే ట్రాక్ వైపు పరార్
- రంగంలోకి స్పెషల్ టీమ్లు
మంచిర్యాల, వెలుగు: కరుడుగట్టిన దొంగల ముఠాగా పేరున్న చెడ్డీ గ్యాంగ్మంచిర్యాలలో ఎంటరైంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక నస్పూర్ తెనుగువాడ, సాయికుంట గోదారివాడ ప్రాంతాల్లో హల్చల్ చేసింది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసు వాహనాలను గమనించిన దొంగలు చెట్ల పొదల్లోంచి రైల్వే ట్రాక్ వైపు పారిపోయారు. ఈ సంఘటనతో మంచిర్యాల ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో టౌన్లలో ఉంటున్న చాలామంది ఇండ్లకు తాళాలు వేసి సొంతూళ్లకు వెళ్లారు. ఇదే టైమ్లో చెడ్డీ గ్యాంగ్ప్రవేశించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
రాత్రి ఒంటి గంట దాటాక..
చెడ్డీ గ్యాంగ్ రాత్రి ఒంటి గంట ప్రాంతంలో నస్పూర్తెనుగువాడలోని పలు ఇండ్లలో చోరీకి యత్నించారు. ఓ ఇంట్లోకి చొరబడి ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లగా, మరో ఇంట్లోకి ప్రవేశించే క్రమంలో ఆ ఇంట్లో ఉన్నవారు అరిచారు. దొంగలు అక్కడినుంచి కలెక్టరేట్ వెనుకవైపు నుంచి సాయికుంట గోదారివాడకు వచ్చారు. మల్లన్న గుడి దగ్గర ఉన్న మరో ఇంట్లోకి తలుపులు తీసి చొరబడ్డారు. హాల్లో వృద్ధురాలు పడుకొని ఉండగా, కుటుంబ సభ్యులు బెడ్రూంలో నిద్రిస్తున్నారు.
బెడ్రూలకు బయటినుంచి గడియపెట్టి వృద్ధురాలి ఒంటిపై బంగారం ఉందేమోనని చూశారు. హాల్లో ఉన్న రెండు బ్యాగులు తీసుకెళ్లి చెక్చేశారు. విలువైన వస్తువులు లేకపోవడంతో వాటిని బయటపడేశారు. ఆ వెనుక లైన్లో ఉన్న మరో రేకుల షెడ్డులో ఇద్దరు యువకులు నిద్రిస్తుండగా, వారి సెల్ఫోన్లు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. అదే లైన్లో మరో ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారు.
అప్పటికే తెనుగువాడకు చెందినవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన డీసీసీ ఏ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాశ్, టౌన్ సీఐ ప్రమోద్రావు, రూరల్ సీఐ ఆకుల అశోక్ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు టీమ్లుగా విడిపోయి తెనుగువాడ, సాయికుంట ఏరియాల్లో పెట్రోలింగ్ చేపట్టారు.
మరోవైపు శ్రీరాంపూర్, హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి పోలీసులను అలర్ట్ చేశారు. గోదారివాడ మల్లన్న గుడి దగ్గర పోలీస్వెహికల్ను చూసిన దొంగలు రైల్వే ట్రాక్ వైపు పారిపోయారు. ఆ విజువల్స్ ఓ ఇంట్లో ఉన్న సీసీ టీవీలో రికార్డయ్యాయి. అప్పటికి రాత్రి 2 గంటలు దాటింది. పోలీసులు ఉదయం 4.30 వరకూ గాలించినప్పటికీ చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ దొరకలేదు. వారిని పట్టుకునేందుకు నాలుగు స్పెషల్ టీమ్లను రంగంలోకి దించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.
అడ్డొస్తే అంతు చూస్తారు
చెడ్డీ గ్యాంగ్ అంటేనే కరుడుగట్టిన దొంగల ముఠా అని పేరుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ప్రాంతాలకు చెందిన ఈ గ్యాంగ్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన సంఘటనలున్నాయి. ఐదు నుంచి ఆరుగురు సభ్యులున్న ఈ ముఠాలు ఎక్కువగా రైల్వే ట్రాక్సమీప ప్రాంతాలనే టార్గెట్ చేస్తాయి.
సాధారణ ప్రయాణికుల్లా రైళ్లలో వచ్చిపోవడానికి, అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఈ ప్రాంతాలైతే అనుకూలంగా ఉంటాయని వాటిని ఎంచుకుంటారని పోలీసులు పేర్కొంటున్నారు. చోరీ సమయంలో ఎవరైనా అడ్డొచ్చినా, ప్రతిఘటించినా ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడరు.
చెడ్డీ గ్యాంగ్ను పట్టుకుంటాం
మంగళవారం రాత్రి చెడ్డీ గ్యాంగ్ గురించి మాకు సమాచారం రాగానే భారీ సంఖ్యలో సిబ్బందితో పది నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాం. గోదారివాడలో దొంగలు చిక్కినట్టే చిక్కి తృటిలో తప్పించుకున్నారు. వారిని పట్టుకునేందుకు నాలుగు స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేశాం. ప్రజలు ఆందోళన చెందవద్దు. కానీ అలర్ట్గా ఉండాలి. ఇండ్లలో, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే మాకు సమాచారం అందించాలి. - ఆర్.ప్రకాశ్, మంచిర్యాల ఏసీపీ