ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ ఘటన తర్వాత దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ముస్లింలు నిర్వహించే లేదా వారు పనిచేసే దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఓ బేకరీ షాపు యజమాని ముస్లింలను కించపరిచే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టయ్యాడు.
చెన్నైలోని టీ నగర్ లో జైన్ బేకరీస్ అండ్ కన్ఫెక్షనరీస్ పేరుతో బేకరీ షాపు నిర్వహిస్తోన్న ఓ వ్యక్తి తమ షాపులోని తినుబండారాలన్నీ జైన మతస్థులు మాత్రమే తయారు చేసినవని, తమ వద్ద ముస్లింలు ఎవరూ పనిచేయడం లేదంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటనను ‘వాట్సాప్’ ద్వారా తమ వినియోగదారులకు షేర్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సదరు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.