హోమ్​ గ్రౌండ్​లో లక్నోపై చెన్నై విక్టరీ

హోమ్​ గ్రౌండ్​లో లక్నోపై చెన్నై విక్టరీ

చెన్నై:  సీజన్‌‌ తొలి పోరులో గుజరాత్‌‌ టైటాన్స్‌‌ చేతిలో దెబ్బతిన్న చెన్నై సూపర్‌‌ కింగ్స్ చెపాక్‌‌ స్టేడియంలో తడాఖా చూపెట్టింది. 1426 రోజుల గ్యాప్​ తర్వాత సొంతగడ్డపై ఆడిన ధోనీసేన దంచికొట్టింది. బ్యాటింగ్‌‌లో రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ (31బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57), డెవాన్‌‌ కాన్వే (29 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47).. బౌలింగ్‌‌లో మొయిన్‌‌ అలీ (4/26) మ్యాజిక్‌‌ చేయడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌‌లో సీఎస్కే  12 రన్స్ తేడాతో  లక్నో సూపర్‌‌ జెయింట్స్‌‌ను ఓడించింది. ఈ హైస్కోరింగ్‌‌ పోరులో తొలుత చెన్నై 20 ఓవర్లలో 217/7 స్కోరు చేసింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్‌‌, మార్క్‌‌ వుడ్‌‌ చెరో మూడు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌లో ఓవర్లన్నీ ఆడిన లక్నో 205/7 స్కోరు చేసి ఓడింది. కైల్​ మేయర్స్ (22 బాల్స్​లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 53) మెరుపు ఆరంభం ఇచ్చినా ఫలితం లేకపోయింది. అలీతో పాటు తుషార్‌‌ దేశ్‌‌పాండే రెండు వికెట్లు తీశాడు.  బ్యాట్​, బాల్​తో  రాణించిన మొయిన్​ అలీకి ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు లభించింది. 

ఓపెనర్ల జోరు

చెన్నై ఇన్నింగ్స్‌‌లో ఓపెనర్లు రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌, డెవాన్‌‌ కాన్వే ఆట హైలైట్‌‌గా నిలిచింది. తొలివికెట్‌‌కు సెంచరీ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌తో ఈ ఇద్దరు జట్టుకు భారీ స్కోరు అందించారు. టాస్‌‌ ఓడిన  సీఎస్కే బ్యాటింగ్​కు దిగగా గైక్వాడ్‌‌, కాన్వే పవర్‌‌ ప్లేను సద్వినియోగం చేసుకొని ఫోర్లు, సిక్సర్లతో జోరు చూపెట్టారు. ఫామ్‌‌ను కొనసాగించిన గైక్వాడ్‌‌ బాల్‌‌ను ఈజీగా స్టాండ్స్‌‌కు పంపాడు. కె.గౌతమ్‌‌ వేసిన ఐదో ఓవర్లో  స్ట్రెయిట్‌‌, లాంగాఫ్‌‌, ఎక్స్‌‌ట్రా కవర్‌‌ మీదుగా మూడు సిక్సర్లతో చెలరేగడంతో  స్టేడియం హోరెత్తిపోయింది. ఆ వెంటనే మార్క్ వుడ్‌‌ బౌలింగ్‌‌లో కాన్వే రెండు ఫోర్లు కొట్టగా, గైక్వాడ్‌‌ సిక్స్‌‌ రాబట్టాడు. దాంతో పవర్‌‌ ప్లేలో సీఎస్కే 79 రన్స్‌‌ చేసింది.  చెపాక్‌‌ స్టేడియంలో హోమ్‌‌టీమ్‌‌కు ఇదే హైయ్యెస్ట్‌‌ పవర్‌‌ప్లే స్కోరు కావడం విశేషం. ఫీల్డింగ్‌‌ మారిన తర్వాత గైక్వాడ్‌‌ కాస్త స్లో అవగా.. కాన్వే జోరు పెంచాడు. క్రునాల్‌‌ వేసిన 9వ ఓవర్లో రెండు సిక్సర్లతో స్కోరు 100 దాటించాడు. అదే ఓవర్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న గైక్వాడ్‌‌ను (25 బాల్స్‌‌లో) పదో ఓవర్లో  స్పిన్నర్‌‌ రవి బిష్ణోయ్‌‌ పెవిలియన్‌‌ చేర్చడంతో ఫస్ట్ వికెట్‌‌కు 110 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయింది. తర్వాతి ఓవర్లోనే కాన్వేను మార్క్‌‌ వుడ్‌‌ షార్ట్‌‌ బాల్‌‌తో బోల్తా కొట్టించాడు. వరుసగా రెండు వికెట్లు పడ్డా చెన్నై స్పీడు తగ్గలేదు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన శివం దూబే (27)  ఫోర్‌‌, మూడు సిక్సర్లతో దూకుడు చూపెట్టాడు. అతనితో పాటు హ్యాట్రిక్‌‌ ఫోర్లతో జోరు మీద కనిపించిన మొయిన్‌‌ అలీ (19)ని బిష్ణోయ్‌‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌‌ చేర్చాడు. స్టోక్స్‌‌ (8), జడేజా (3) మళ్లీ ఫెయిలైనా అంబటి రాయుడు (27 నాటౌట్‌‌) రెండు ఫోర్లు, సిక్సర్లతో స్కోరు 200 దాటించాడు. వుడ్‌‌ వేసిన లాస్ట్ ఓవర్లో ధోనీ (12)  వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో  స్టేడియం మొత్తం దద్దరిల్లింది.  ఈ క్రమంలో ఐపీఎల్​లో ధోనీ 5000 రన్స్​ పూర్తి చేసుకున్నాడు. 

మొయిన్​ మ్యాజిక్​

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో లక్నోకు మెరుపు ఆరంభం లభించింది. తొలి పోరులో దంచిన కరీబియన్‌‌ హిట్టర్‌‌ కైల్‌‌ మేయర్స్‌‌ మరోసారి ఖతర్నాక్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడాడు. స్టోక్స్‌‌ వేసిన రెండో ఓవర్లో 4, 4, 6తో జోరు చూపెట్టిన అతను దీపక్‌‌ చహర్‌‌ బౌలింగ్‌‌లో మూడు ఫోర్లు బాదాడు. అంబటి రాయుడు ప్లేస్‌‌లో ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌ గా వచ్చిన పేసర్‌‌ తుషార్‌‌ దేశ్‌‌ పాండే  బౌలింగ్​లో ఫోర్‌‌, 91 మీటర్ల సిక్స్‌‌ బాదడంతో స్కోరు 50 దాటింది. మరో రెండు ఫోర్లతో మేయర్స్ 21 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో  సీఎస్కే స్పిన్నర్‌‌ మొయిన్‌‌ అలీ మ్యాజిక్‌‌ చేశాడు. తన కోటాలో ఓవర్‌‌కో వికెట్‌‌ చొప్పున నాలుగు వికెట్లు పడగొట్టాడు. మేయర్స్,   కెప్టెన్‌‌ రాహుల్‌‌ (20)తో పాటు హిట్టర్లు క్రునాల్‌‌ (9), స్టోయినిస్‌‌ (21)ను వెనక్కుపంపి మ్యాచ్​ను మలుపు తిప్పాడు. మధ్యలో దీపక్‌‌ హుడా (2)ను శాంట్నర్‌‌ ఔట్‌‌ చేశాడు. కానీ, హంగర్గేకర్‌‌ బౌలింగ్‌‌లో 6, 4, 4తో గేరు మార్చిన నికోలస్‌‌ పూరన్‌‌ (32).. జడేజా వేసిన 15వ ఓవర్లో మరో రెండు సిక్సర్లతో లక్నో క్యాంప్‌‌లో ఆశలు రేపాడు. కానీ, తుషార్‌‌ వేసిన తర్వాతి ఓవర్లో  భారీ షాట్‌‌ ట్రై చేసిన బౌండ్రీ వద్ద స్టోక్స్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో 156/6తో డీలా పడింది.  చివర్లో ఇంపాక్‌‌ ప్లేయర్‌‌ బదోనీ (23 ), క్రిష్ణప్ప గౌతమ్‌‌ (17 నాటౌట్​ ), మార్క్​ వుడ్​ (10 నాటౌట్​) పోరాటం ఓటమి అంతరాన్నే తగ్గించింది.