
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో కిలో టమాటా రూ.60కే అందుబాటులోకి తెచ్చింది. చెన్నైలోని 82 చౌకధరల దుకాణాల్లో మంగళవారం నుంచి కిలో టమాటా రూ.60కి అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ ప్రకటించారు. చెన్నైలో ఫామ్ ఫ్రెష్ ఔట్లెట్స్, కొయంబత్తూర్, సేలం, వెల్లూర్లో కిలో టమాటా రూ.60కి విక్రయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తొలి దశలో ఒక కుటుంబానికి రోజుకు ఒక కిలో టమాటా చొప్పున మాత్రమే అమ్ముతున్నట్లు కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారి వెల్లడించారు. నార్త్ చెన్నైలోని 32 దుకాణాల్లో, చెన్నై సెంట్రల్ లో 25, సౌత్ చెన్నైలోని 25 ఎఫ్ పీ షాపుల్లో టమాటాలు విక్రయిస్తున్నట్లు చెప్పారు. కాగా, కొయంబేడు హోల్సేల్ మార్కెట్లో కిలో టమాటా రూ.110కి విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. టమాటాలతోపాటు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర ధరలు కూడా భారీగా పెరిగాయి. వీటిని కిలో రూ.150 నుంచి రూ.200కు అమ్ముతున్నట్లు వ్యాపారులు చెప్పారు.