గ్రేట‌ర్ ఎన్నికల్లో 105 సీట్లు గెలుస్తాం.. సర్వేలన్ని టీఆర్ఎస్ కే అనుకూలం

గ్రేట‌ర్ ఎన్నికల్లో 105 సీట్లు గెలుస్తాం.. సర్వేలన్ని టీఆర్ఎస్ కే అనుకూలం

హైదరాబాద్: గ్రేట‌ర్ ఎన్నికల్లో 105 సీట్లు గెలుస్తామ‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. బుధ‌వారం సీఎం అధ్యక్షతన టీఆర్ఎస్ భవన్‌లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా సీఎం గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో సర్వేలన్ని టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని, కాంగ్రెస్ ను ప‌ట్టించుకోవాల‌సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇన్నాళ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రేటర్‌లో చేసిన అభివృద్ధితో పాటు.. కరోనా, వరదల్లో వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీ నేతల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క ఎమ్మెల్యేను ఇంఛార్జ్‌గా నియ‌మించి, మంత్రులకు డివిజన్ బాధ్యతలు అప్ప‌గించినట్టు తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూస్తోందని, కేంద్రం పైన పోరాటం చేయాలని అన్నారు. అన్ని కంపెనీలు ప్రైవేట్ పరం చేస్తే కార్మికులు రోడ్డున పడ‌తార‌ని, కార్మికుల పక్షాన‌ పోరాటం చేస్తామ‌ని చెప్పారు. వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతల తో ఇవ్వాళ ఫోన్ లో మాట్లా డానని, భవిష్యత్ లో అందరినీ కలుపుకొని పోయి కేంద్రంపై యుద్దం చేస్తామ‌ని చెప్పారు.

వరద బాధితులకు సంబంధించి 2 లక్షల ద‌ర‌ఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు లక్షా అరవై వేల ద‌ర‌ఖాస్తుల‌కు వ‌ర‌ద సాయం మంజూరు చేశామ‌ని అన్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ అమల్లో ఉన్నందున మిగ‌తా వారికి ఎల‌క్షన్ ల తర్వాత ఇస్తామ‌ని సీఎం చెప్పారు