
- యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకు తగ్గుతున్న స్టూడెంట్లు
- లిథ్వేనియా, ఎస్టోనియా, చిలీ, మాల్టా వంటి దేశాలకే జై
- ఇండియన్లు సహా వివిధ దేశాల స్టూడెంట్లదీ ఇదే బాట
న్యూఢిల్లీ: విదేశాల్లో చదువులు అంటే.. ఇప్పటివరకూ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకే స్టూడెంట్లు టాప్ ప్రయారిటీ ఇచ్చేవారు. కానీ గత రెండేండ్లుగా ఈ ట్రెండ్ మారుతోందని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు చెప్తున్నారు. పెద్ద దేశాల కంటే చిన్న దేశాలకు వెళ్లి చదువుకునేందుకే ఇండియా, తదితర దేశాల స్టూడెంట్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్లకు ఇప్పటివరకూ బిగ్ 4 దేశాలుగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా టాప్ ప్రయారిటీగా ఉండేవి. కానీ ఇప్పుడు లిథ్వేనియా, ఎస్టోనియా, చిలీ, టర్కీ, మాల్టా, తైవాన్, సౌత్ కొరియా వంటి దేశాలకు వెళ్లేందుకే ఇంటర్నేషనల్ స్టూడెంట్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ‘రెడ్ సీర్’ అనే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సర్వీస్ సంస్థ చెప్తోంది. బిగ్ 4 దేశాల్లో చదవాలంటే ఖర్చు ఎక్కువగా ఉండటంతోపాటు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని.. అదే లిథ్వేనియా తదితర దేశాల్లో ఖర్చు చాలా తక్కువ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడమే ఈ కొత్త ట్రెండ్కు కారణమని ఎక్స్ పర్ట్ లు పేర్కొంటున్నారు.
స్టూడెంట్ ఫ్రెండ్లీ పాలసీలు..
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావడం(బ్రెగ్జిట్)తో ఆ దేశం ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది. మైగ్రెంట్ల పట్ల వ్యతిరేక విధానాలు మొదలయ్యాయి. కెనడాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్లకు తక్కువ సీట్లు ఉండటంతోపాటు అకామడేషన్ క్రైసిస్ కొనసాగుతోంది. అమెరికాలో ఫీజులు, ఖర్చు చాలా ఎక్కువగా ఉండటం, ఉపాధి అవకాశాలు పరిమితంగానే ఉండటం ప్రతికూల అంశాలుగా మారుతున్నాయి. కానీ లిథ్వేనియా, తదితర దేశాలు చిన్నవే అయినా విద్యారంగం, టెక్నాలజీ రంగాల్లో బాగా అభివృద్ధి చెందాయి. పైగా చాలా దేశాలు స్టూడెంట్ ఫ్రెండ్లీ విధానాలు అనుసరిస్తున్నాయి. సులభంగా వీసాలు ఇస్తూ, స్కాలర్ షిప్ లు అందజేస్తూ విదేశీ స్టూడెంట్లను ఆకర్షిస్తున్నాయి.
ప్రత్యామ్నాయ దేశాలకు పెరుగుతున్న వలసలు..
యూనివర్సిటీ అండ్ కాలేజెస్ అడ్మిషన్స్ సర్వీస్ (యూసీఏఎస్) సంస్థ సర్వే ప్రకారం.. ఈ స్టూడెంట్ ఇయర్లో బ్రిటన్లో యూజీ కోర్సుల కోసం అప్లై చేసుకునే ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య 4% మేరకు తగ్గిపోయినట్లు తేలింది. రెడ్ సీర్ సంస్థ రీసెర్చ్ ప్రకారం.. గతంలో విదేశాల్లో చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్లలో 75 నుంచి 80% మంది బిగ్ 4 దేశాలనే సెలక్ట్ చేసుకునేవారు. కానీ 2024 వచ్చేసరికి ఇండియన్ స్టూడెంట్లు ప్రత్యామ్నాయ దేశాలపై ఫోకస్ పెట్టారని ఈ సంస్థ రిపోర్ట్ను బట్టి తెలుస్తోంది.
చిన్న దేశాల్లో ఫీజులు రెండు మూడు లక్షలే..
ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశాలైన లిథ్వేనియా, ఎస్టోనియాలో భద్రత, వందశాతం స్కాలర్ షిప్లు వంటి అంశాలు స్టూడెంట్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఈ దేశాల్లో లివింగ్ కాస్ట్ నెలకు కేవలం 300 యూరోల(రూ.26 వేలు) వరకే ఉండటం మరింత కలిసొచ్చే విషయం.
పాపులర్ డెస్టినేషన్ గా చిలీ..
ప్రధానంగా చిలీ ప్రస్తుతం ఇండియన్లతో సహా వివిధ దేశాల స్టూడెంట్లకు పాపులర్ డెస్టినేషన్గా మారిందని అప్లై బోర్డ్ అనే సంస్థ వెల్లడించింది. చిలీ ప్రభుత్వం భారీగా స్కాలర్ షిప్ లు ఇస్తుండటం, వీసా ప్రాసెస్ ఈజీగా ఉండటం వంటివే ఇందుకు కారణమని తెలిపింది. యూకే, కెనడా వంటి దేశాల్లో రూల్స్ స్ట్రిక్ట్ చేయడంతో జర్మనీ, సింగపూర్, ఫిన్లాండ్, యూఏఈ, జపాన్, మలేసియా, స్పెయిన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాలకూ స్టూడెంట్ల సంఖ్య పెరుగుతోందని కన్సల్టెంట్లు చెప్తున్నారు. లివింగ్ కాస్ట్, ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉన్న మాల్టా, తైవాన్ దేశాలకూ స్టూడెంట్లు క్యూ కడుతున్నారని చెప్పారు.