మిర్చి విత్తనాల కోసం ఖమ్మం గాంధీచౌక్లోని సీడ్స్ షాపుల దగ్గర సోమవారం రైతులు బారులు తీరారు. గంటల కొద్ది నిలబడి విత్తనాలు కొనుగోలు చేశారు. ఒక్కసారిగా రైతులు ఎక్కువమంది తరలిరావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయమేర్పడింది. మహిళా రైతులకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయకపోవడంతో వారు కూడా ఇబ్బంది పడ్డారు. తాము ఆశించిన రకం విత్తనాలు మార్కెట్లో లేకపోవడంతో రైతులు నిరాశచెందారు.
విత్తనాల కోసం ఇబ్బంది పడుతున్నాం..
పొద్దునొచ్చి లైన్లో నిలబడ్డం. కావాల్సిన విత్తనాలు దొరకలేదు. షాపుల దగ్గర ఆడవాళ్లకు సెపరేట్ లైను లేక మగవాళ్లతోపాటే నిలడాల్సివచ్చింది. ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో చాలా దూరం నుంచి వచ్చిన ఆడవాళ్లం ఇబ్బంది పడ్డాం. దుకాణాల దగ్గర కరోనా రూల్స్ కూడా పాటించలేదు.
– రమాదేవి, మహిళా రైతు, లచ్చగూడెం, చింతకాని మండలం
బ్లాక్లో అమ్ముతున్నరు
ఎక్కువ దిగుబడి వచ్చే రకాల సీడ్స్ను రైతులకు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. కోరుతున్న విత్తనాలు అడిగినన్ని ఇవ్వడంలేదు. రెండు మూడు రకాల సీడ్ దొరకట్లేదు. సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం.
- కన్నెగంటి మాధవరావు, రైతు, గణేశ్వరం, రఘునాథపాలెం మండలం
ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఖమ్మం, కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో మిర్చి సీడ్ను వ్యాపారులు బ్లాక్మార్కెటింగ్ చేస్తున్నారు. అధిక దిగుబడులు ఇచ్చే యసెశ్వనీ, 2222, ఆర్మోర్ తదితర తేజా రకం మిర్చి విత్తనాలకు మార్కెట్లో ప్రస్తుతం అధిక డిమాండ్ఉంది. వీటి కోసం రైతులు ఎగబడుతుండడంతో సీడ్ మాఫియా క్యాష్ చేసుకుంటోంది. ప్రతి ఎకరాకు సుమారు 15 విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, ఆఫీసర్లు ప్రైవేట్ షాపుల్లో ఒక్కో రైతుకు ఐదు మాత్రమే ఇప్పిస్తున్నారు. దీంతో అన్నదాతలు బ్లాక్ మార్కెట్లో డబుల్ రేట్లకు కొనుగోలు చేసి నష్టపోతున్నారు.
ఒక్కో రైతుకు పది ప్యాకెట్లే..
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన రైతులు వానకాలం సుమారు 9-0వేల నుంచి లక్ష ఎకరాల్లో మిర్చి పంట సాగుచేస్తారు. ప్రస్తుతం సీజన్ ప్రారంభమైనందున నార్లు పోసుకునేందుకు కావాల్సిన విత్తనాల వేటలో పడ్డారు. కానీ ప్రభుత్వం సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. సర్కారు ఎలాగూ సబ్సిడీ విత్తనాలు సప్లై చేయట్లేదు. కనీసం కావాల్సినన్ని విత్తనాలను ప్రైవేట్గానైనా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా అధికదిగుబడులు ఇచ్చే యసెశ్వనీ, 2222, ఆర్మోర్ తదితర తేజా రకం మిర్చి వంగడాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఈ సీడ్ కోసం రైతులు పొద్దున్నే ఫర్టిలైజర్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. అందరూ ఈ బ్రాండెడ్ విత్తనాల కోసం ఎగబడుతుండడంతో వ్యాపారులు బ్లాక్ చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో ఆఫీసర్లు ప్రతి రైతుకు 5 ప్యాకెట్లు బ్రాండెడ్, ఐదు ప్యాకెట్లు ఇతర కంపెనీల విత్తనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
రూ.600 ప్యాకెట్కు రూ.1200
ప్రతి ఎకరాకు సుమారు 10 గ్రాముల వెయిట్ ఉన్న 15 ప్యాకెట్లు అవసరముంటాయని రైతులు చెబుతున్నారు. కానీ ప్రైవేట్గా ఒక్కో పాస్బుక్పై కేవలం బ్రాండెడ్5, అన్బ్రాండెడ్5 చొప్పున కేవలం 10 ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు. ఈ విత్తనాలు ఎకరానికి కూడా సరిపోవు. దీంతో రైతులు యసెశ్వనీ, 2222, ఆర్మోర్ లాంటి విత్తనాలను బ్లాక్లో కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్ల ధర పది గ్రాములకు రూ.600 ఉండగా బ్లాక్లో రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. షాపుల వద్ద ప్రత్యేకంగా నియమించుకుంటున్న వ్యక్తులతో పాటు కంపెనీల ఏజెంట్లు ఈ దందాతో రైతులను దోచుకుంటున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు, పోలీసుల నామమాత్రపు పర్యవేక్షణ వల్ల ఈ బ్లాక్ మార్కెట్దందా సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున వెంటనే అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు బ్లాక్మార్కెటింగ్ దందాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.