
- అప్పుడే పుట్టిన శిశువు మొదలు.. రెండేండ్లలోపు చిన్నారులకు అత్యవసర సేవలు
- అంబులెన్స్లో అడ్వాన్డ్స్ టెక్నాలజీతో పాటు, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీసిబ్రిలేటర్ సిస్టమ్
- ములుగు జిల్లాలో రెండేండ్లలో 1,235 మంది చిన్నారులకు ట్రీట్మెంట్
ములుగు, వెలుగు : నవజాత శిశు మరణాలను తగ్గించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నియోనటల్ అంబులెన్స్’ సత్ఫలితాలను ఇస్తోంది. అప్పుడే పుట్టిన శిశువు మొదలు.. రెండేండ్ల లోపు చిన్నారులకు శ్వాస సంబంధిత సమస్యలు, తక్కువ బరువుతో పుట్టడం, ఉమ్మనీరు మింగడం,బిడ్డ అడ్డం తిరగడం, కామెర్లు, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్, హైపోగ్లసీమియా, గుండె సంబంధిత సమస్యలు.. ఇలా ఏ అనారోగ్య సమస్య వచ్చినా నియోనటల్ అంబులెన్స్ల ద్వారా సత్వర సేవలు అందుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న ఈ నియోనాటల్ అంబులెన్స్ల ద్వారా ఇప్పటివరకు వేలాది మంది చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
అత్యాధునిక పరికరాలతో వైద్యసేవలు
నియోనాటల్ అంబులెన్స్లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. రిమోట్లో మానిటరింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రెండేండ్ల లోపు చిన్నారులకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా 108కు ఫోన్ చేయగానే.. నియోనటల్ అంబులెన్స్కు సిఫార్సు చేస్తారు. చిన్నారులు కార్డియాక్ అరెస్ట్, ఊపిరి తీసుకోలేకపోవడం, ఇతర వైద్యపరమైన సమస్యలకు గురైనప్పుడు అంబులెన్స్లో ఉన్న నియోనాటల్ ఐసీయూ, వార్మర్, ఇంక్యూబేటర్ ద్వారా ఈఎంటీ ట్రీట్మెంట్ చేస్తూ... చిన్నారిని హాస్పిటల్కు తరలిస్తారు.
ఈ అంబులెన్స్లో ఉన్న ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీసిబ్రిలేటర్ (ఏఈడీ) వంటి అడ్వాన్డ్ టెక్నాలజీ సాయంతో.. హార్ట్లోని మజిల్స్ను రీస్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు ఈ అంబులెన్స్లో అడ్వాన్డ్స్ మెడిసిన్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. 18 ఏండ్లకు పైగా సర్వీస్ ఉన్న వారినే ఈ అంబులెన్స్లో ఈఎంటీ, పైలట్గా నియమించారు. వీరికి సాధారణ 108 ట్రైనింగ్తోపాటు మరో నెల రోజుల పాటు నియోనటల్ అంబులెన్స్ మానిటరింగ్ చేసే విధానంపై శిక్షణ ఇస్తారు. అలాగే ప్రతీ ఏడాది వారం రోజుల పాటు ప్రత్యేక ట్రైనింగ్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు.
ములుగు జిల్లాలో రెండేండ్లలోనే 1,235 కేసుల పరిస్కారం
ములుగు జిల్లాలో 2023 ఆగస్ట్ 22న మంత్రి సీతక్క నియోనటల్ అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ రెండేండ్లలోనే 1,235 చిన్నారులను కాపాడారు. ములుగు జిల్లాలో సరైన రవాణా సౌకర్యం లేని వాజేడు, వెంకటాపురం, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో ఉండే ఆదివాసీలకు నియోనాటల్ అంబులెన్స్ సేవలు వరంగా మారాయి. చిన్నారులు పీహెచ్సీ, సీహెచ్సీలలో ఉన్న టైంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే తల్లీబిడ్డను ఈ నియోనటల్ అంబులెన్స్ ద్వారా ములుగు జిల్లా హాస్పిటల్కు తరలిస్తున్నారు. అక్కడ కూడా ఇబ్బంది ఉన్నట్లయితే వైద్యుల సిఫార్సుతో వరంగల్ ఎంజీఎంకు తరలిస్తున్నారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను హైదరాబాద్లోని నిమ్స్కు తరలించిన ఘటనలూ ఉన్నాయి.
ప్రజల్లో అవగాహన పెరగాలి
ములుగు జిల్లాలో సేవలు అందిస్తున్న 108 నియోనటల్ అంబులెన్స్పై ప్రజలకు అవగాహన పెంచుకోవాలి. సాధారణ 108 అంబులెన్స్ సేవలు పొందుతున్న ప్రజలు నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా నియోనాటల్ అంబులెన్స్ ఉందనేది తెలుసుకోవాలి. ఈ అంబులెన్స్పై ఇటీవల వైద్యాధికారులు సైతం అవగాహన కల్పిస్తున్నారు. రెండేండ్లలో ఏడాదికి 600 మంది చిన్నారుల కేసులను పరిష్కరించాం. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రెండేండ్ల లోపు చిన్నారుల కోసం ఈ అంబులెన్స్ను వినియోగించుకోవాలి.పిట్టల రాజ్కుమార్, డిస్ట్రిక్ట్ మేనేజర్, 108, 102 అంబులెన్స్ సర్వీసెస్