న్యూఢిల్లీ:ఇండియా, చైనా బార్డర్లో మరోసారి ఘర్షణ తప్పేలా లేదు.. మొన్న గల్వాన్ లోయలో జరగగా, ఈసారి దౌలత్ బేగ్ ఓల్డీ(డీబీఓ), డెప్సంగ్ సెక్టర్లో ఘర్షణ జరిగే పరిస్థితి కనిపిస్తోందని మన ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఈ నెల మొదట్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) బలగాలు డెప్సంగ్ సెక్టర్ వైపు కదులుతున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైందని తెలిపాయి. 2013లో చైనా ఈ సెక్టార్ను ఆక్రమించి, క్యాంపు ఏర్పాటు చేసుకుంది. మన దేశం ఒత్తిడి పెంచడంతో 2016 కన్నా ముందే క్యాంపును ఎత్తేసినట్లు తెలిపింది. తాజాగా ఈ ప్లేస్లో క్యాంపులు, వెహికిల్స్ కదలికలను మన సైన్యం గుర్తించింది. చైనా దుర్మార్గాన్ని ముందే ఊహించిన మన సైన్యం.. గత నెలాఖరులోనే డెప్సంగ్ సెక్టార్ దిశగా బలగాలను పంపించింది. దీంతో అక్కడ కూడా గల్వాన్ తరహా ఘర్షణ జరిగే అవకాశం ఉందని డిఫెన్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చైనా బుద్ధి మారలే..
గల్వాన్ వ్యాలీలో ఘర్షణ తర్వాత కూడా చైనా తన బుద్ధి మార్చుకోలేదు. ఘర్షణ తర్వాత ఇరువైపులా నెలకొన్న టెన్షన్ను తగ్గించేందుకు రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. బుధవారం జరిగిన మీటింగ్లో బార్డర్లో శాంతియుత వాతావరణం నెలకొల్పుకునేందుకు రెండు దేశాలు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయి. ఓవైపు ఈ చర్చలు నడుస్తుండగానే చైనా మరో వైపు బార్డర్ వెంట పెద్ద సంఖ్యలో బలగాలను మోహరిస్తోంది. దీంతో మన సైన్యం కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట రెడీగా ఉంది.
గల్వాన్ వ్యాలీలో కూడా..
గల్వాన్లో బలగాలను వెనక్కు తీసుకోవడానికి ఒప్పుకున్నట్లే ఒప్పుకున్న చైనా.. అదే టైంలో ఎల్ఏసీ వెంట పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించింది. లేటెస్ట్గా హైరిజల్యూషన్తో తీసిన శాటిలైట్ఫొటోల్లో పెట్రోల్ పాయింట్14 వద్ద భారీ వాహనాలు, టెంట్లను గుర్తించినట్లు డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 15న ఘర్షణ జరిగిన ప్రాంతంలో చైనా సైనికులు క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారని రిటైర్డ్ మేజర్ జనరల్ రమేశ్ పాఢి చెప్పారు. ఈ నెల 16 వ తేదీకి ముందు తీసిన శాటిలైట్ చిత్రాల్లో శిథిలాలు కనిపించాయని, ఆ తర్వాత తీసిన ఫొటోల్లో అక్కడ టెంట్లు, వెహికిల్స్ కనిపించాయన్నారు.