హైస్పీడ్ రైళ్ల విషయంలో చైనా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జస్ట్ రెండు సెకండ్లలోనే 700 కి.మీ వేగాన్ని అందుకునే మాగ్లెవ్ రైలును విజయవంతంగా పరీక్షించింది. మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో ఈ మాగ్లెవ్ మోడల్ ట్రైన్ను రూపొందించింది.
మాగ్లెవ్ రైలును విజయవంతంగా పరీక్షించిన చైనా
బీజింగ్: హైస్పీడ్ రైళ్ల విషయంలో చైనా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జస్ట్ రెండు సెకండ్లలోనే 700 కి.మీ వేగాన్ని అందుకునే మాగ్లెవ్ రైలును విజయవంతంగా పరీక్షించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో ఈ మాగ్లెవ్ మోడల్ ట్రైన్ ను రూపొందించినట్టు చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ తెలిపింది. దీని బరువు దాదాపు టన్ను వరకు ఉంటుందని చెప్పింది.
400 మీటర్ల (1,310-అడుగులు) మాగ్లెవ్ ట్రాక్ పై దీన్ని పరీక్షించినట్టు వర్సిటీ ప్రొఫెసర్ లి జీ పేర్కొన్నారు. ఇప్పటివరకు తాము రూపొందించిన అత్యంత వేగవంతమైన సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ సిస్టమ్ రైలుగా ఇది నిలిచిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై తమ బృందం పదేండ్లుగా పని చేస్తున్నదని వివరించారు.
ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన ప్రయోగంలో ఇదే రైలు 648 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకున్నదని తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇదే యూనివర్సిటీ దేశంలో మొట్టమొదటిసారిగా మనుషులు ప్రయాణించే సింగిల్ బోగీ మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేసిందని చెప్పారు.
