భారత్ – చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చైనాకు సరెండర్ అయిపోయారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు. “అవతలి వారిపై విమర్శలు చేసే ముందు మనం పవర్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో గుర్తుంచుకోవాలి. 1962 వార్ తర్వాత దాదాపు 45 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. అది ఇప్పటికీ ఆ దేశం ఆధీనంలోనే ఉంది. గతంలో అంతటి భారీ స్థాయిలో జరిగిన దురాక్రమణను ఎప్పటికీ మరచిపోలేం” అంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ పేరు ఎత్తకుండా నాటి సంఘటనల్ని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా చైనా ఏమైనా మన భూభాగాన్ని ఆక్రమించిందా లేదా అన్నది తనకు తెలియదని, అయితే ఒకరిపై విమర్శలు చేసేటప్పుడు మన టైమ్లో ఏం జరిగిందన్నది మర్చిపోకూడదని హితవు చెప్పారు శరద్ పవార్. ప్రస్తుతం గాల్వన్ ఘటనలో ఎక్కడా రక్షణ మంత్రి ఫెయిల్ అయినట్లు తనకు అనిపించలేదని చెప్పారు. మన బలగాలు గాల్వన్ లోయ ప్రాంతంలో మౌలిక వసతులను పెంచుతున్నాయని, రోడ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. అదే సమయంలో సరిహద్దుల్లో నిత్యం పెట్రోలింగ్ వల్లే చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చే ప్రయత్నాన్ని గుర్తించగలిగారని పవార్ అన్నారు. భారత సైనికులు అలర్ట్గా ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని, అలా లేకుంటే చైనా బలగాలు ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలిసేది కాదని చెప్పారు. మన జవాన్లు అప్రమత్తంగా ఉండడం వల్లే చైనా బలగాలు భారత భూభాగంలోకి వచ్చినప్పుడు తోపులాట, ఘర్షణలు జరిగాయని శరద్ పవార్ అన్నారు. చైనానే రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే ఇందులో రక్షణ మంత్రి, భారత జవాన్ల వైఫల్యం ఎక్కడా లేదని, దేశ రక్షణకు సంబంధించిన అంశంలో రాజకీయాలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.
జూన్ 15న రాత్రి తూర్పు లఢఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొరబడే ప్రయత్నం చేయడంతో భారత బలగాలు అడ్డుకున్నాయి. ఆ సమయంలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అయితే భారత సైనికులు దీటుగా చైనా ఆర్మీని తరిమికొట్టారని, దాదాపు 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారని నాడు వార్తలు వచ్చాయి. ఈ సంఘటన నేపథ్యంలో సరిహద్దుల వెంట నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు ప్రధాని మోడీ జూన్ 19న అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా ఆక్రమణలో కొత్తగా భారత భూభాగం ఇంచు కూడా లేదని చెప్పారు. మాతృభూమిపై కన్నేసిన వారికి మన సైనికులు గుణపాఠం చెప్పారని అన్నారు. అయితే ఈ సమయంలో 20 మంది సైనికులు అరులయ్యారని చెప్పారు. కాగా, ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ఆయన చైనా దూకుడుకు సరెండర్ అయిపోయారంటూ ఆరోపించారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదని అబద్ధాలు చెబుతున్నారని, ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. చైనా దురాక్రమణకు పాల్పడకుంటే మన సైనికులు ఎందుకు చనిపోయారు? ఎక్కడ చనిపోయారంటూ ప్రశ్నించారు.