60 ఏండ్లు దాటిన వారిపై చైనా ఫోకస్

60 ఏండ్లు దాటిన వారిపై చైనా ఫోకస్

బీజింగ్: కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేసింది చైనా. తొలుత 60 ఏండ్లు దాటిన వారిపై ఎక్కువగా ఫోకస్​ చేసింది. వారికి వ్యాక్సిన్​ ఇచ్చేందుకు స్పెషల్​ డ్రైవ్​ చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి టీకాను అందిస్తోంది. ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు వెళ్లకుండా అడ్డుకునే చర్యల్లో భాగంగా.. ఇటీవల చైనా టెస్టులు, క్వారంటైన్, ఇతర నిబంధనలను తొలగించడమో లేదా సడలించడమో చేసింది. అయితే, ఇది కొత్త కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో వచ్చే రోగులతో ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. మరోవైపు, నేషనల్ హెల్త్​ కమిషన్ నవంబర్ 29న చైనాలో ముసలివారిలో టీకా రేటును పెంచడానికి ప్రత్యేక డ్రైవ్​ను చేపట్టింది. ఆరోగ్య సంక్షోభం కాకుండా అడ్డుకట్ట వేయడంలో ఇది చాలా కీలకమని హెల్త్​ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. 

కరోనా రూల్స్ సడలించడంతో..

జీరో కోవిడ్​ పాలసీలో భాగంగా చైనా రెండేండ్లుగా కరోనా కేసుల సంఖ్యను చాలా తక్కువగా చూపించింది. సిటీలకు సిటీలనే ఐసోలేషన్​లో ఉంచడం.. లక్షలాది మందిని ఇండ్లకే పరిమితం చేయడంతో అప్పట్లో కరోనా కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఇప్పుడు రూల్స్​ను సడలించడంతో కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతోంది. ఇప్పటికే చాలా దేశాలు దాటేసిన సామాజిక వ్యాప్తి దశకు ఇప్పుడు చైనా చేరుకుంది. ఈ నెలలో ఇప్పటి వరకు చైనాలో ఆరుగురే కరోనాతో చనిపోయినట్టు ఆ దేశ ఆరోగ్య కమిషన్​ వెల్లడించింది. దీంతో చైనాలో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,241కి చేరింది. అయితే తమ కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతో మంది మరణిస్తున్నారంటూ చాలా కుటుంబాలు చెబుతున్నాయి. చైనా అధికారిక లెక్కల్లో న్యుమోనియా లేదా శ్వాసకోశ వైఫల్యంతో మరణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటోందని ఆ దేశ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఇది కరోనా మరణాలకు సరైన నిర్వచనం కాదు. దీంతో ఇతర దేశాల్లో మరణాల సంఖ్యకు చైనాకు చాలా తేడా ఉంటోంది. కాగా, 2023 చివరి నాటికి చైనాలో 10 లక్షల నుంచి 20 లక్షల మరణాలు సంభవించవచ్చని ఎక్స్​పర్ట్స్​ అంచనా వేస్తున్నారు.

సైడ్​ ఎఫెక్ట్స్ భయం..

వ్యాక్సినేషన్​ను వేగవంతం చేసేందుకు చైనా ప్రయత్నాలు చేస్తుంటే.. వ్యాక్సిన్​కు సంబంధించిన భయాలతో చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. వ్యాక్సిన్​ తీసుకున్న వారిలో ఫీవర్, బ్లడ్​ క్లాట్స్ వంటి సైడ్​ ఎఫెక్ట్స్​ కనిపిస్తున్నాయి. దీంతో 60 ఏండ్లు దాటిన వారు వ్యాక్సిన్​ వేయించుకోవాలా లేదా అనే దానిపై ఆందోళన చెందుతున్నారు. కేసులు పెరుగుతున్నా.. టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.