
పేద దేశాలు చైనాకు సులువుగా లొంగి పోతున్నాయి. తమ దేశాలను ఆర్థిక ఊబిలోంచి గట్టెక్కించేందుకు చైనా దగ్గర భారీగా రుణాలు తీసుకుంటున్నాయి. డ్రాగన్ కంట్రీ అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పందాలపై సంతకాలు పెడుతున్నాయి. దీంతో చైనా గత 10 ఏళ్లలో మధ్య, దిగువ స్థాయి ఆదాయాలు కలిగిన దేశాలకు రుణాలు ఇవ్వడం మూడు రెట్లు పెరిగింది. 2020 నాటికి చైనా వివిధ దేశాలకు ఇచ్చిన మొత్తం అప్పు 170 బిలియన్ డాలర్లు. ఇలా రుణాలిచ్చుకుంటూ పేద దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఆ దేశం భావిస్తోంది. చైనా నుంచి రుణాలు తీసుకున్న దేశాల లిస్టులో పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ కూడా ఉన్నాయి. ‘చైనా మొదట దౌత్యపరమైన ఒప్పందాలు జరిపి తర్వాత అభివృద్ధి పేరుతో అధిక వడ్డీ జోడిస్తూ ఇష్టారీతిన రుణాలు అంటగడుతోంది. కాదన్నా తీసుకోవాలని బలవంతం చేస్తోంద’ని అమెరికా ఆరోపిస్తోంది.
పాకిస్తాన్లో ప్రస్తుతం ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఆ దేశం చైనా దగ్గర రుణాలు తీసుకుంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీలంకకు ఎదురైన క్లిష్టమైన పరిస్థితులు పాకిస్తాన్ కు ఎదురవుతాయని అమెరికా ఆందోళన చెందుతోంది. ఆయా దేశాలు ఇప్పటికైనా చైనా మాటలు వినకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలని అమెరికా సూచిస్తోంది. చైనా నుంచి ఈ దేశాలను కాపాడేందుకు భారత్, అమెరికా చర్యలు తీసుకోనున్నాయని దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ ప్రకటించారు. మార్చి 1 నుంచి 3 వరకు అమెరికా దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ భారత్ పర్యటించి చర్చలు జరుపనున్నారు.