
షెన్జెన్ (చైనా): ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–-5, 21–-10తో డెన్మార్క్కు చెందిన జూలీ దవాల్ జాకోబ్సన్పై వరుస గేమ్స్లో గెలిచి ప్రిక్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో ఆరుసార్లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సింధు ఈ మ్యాచ్ను మాత్రం 27 నిమిషాల్లోనే ముగించింది.
స్టార్టింగ్ నుంచే అదరగొట్టిన తెలుగు షట్లర్ ఫస్ట్ గేమ్ను పది నిమిషాల్లోనే సొంతం చేసుకుంది. రెండో గేమ్నూ 4–1తో ఆరంభించింది. జాకోబ్సన్ 4–4తో స్కోరు సమం చేసి పుంజుకునే ప్రయత్నం చేసినా ఇండియా స్టార్ తనదైన టెక్నిక్తో 11–8తో బ్రేక్కు వెళ్లింది. అదే జోరుతో వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 17–8తో ముందంజ వేసిన ఆమె ఈజీగా మ్యాచ్ నెగ్గింది.
ప్రిక్వార్టర్స్లో తను థాయ్లాండ్కు చెందిన ఆరో సీడ్ పోర్న్పావీ చోచువోంగ్తో తలపడనుంది.- మెన్స్ సింగిల్స్లో యంగ్ షట్లర్ అయూష్ శెట్టి తొలి రౌండ్లో 19-–21, 21–-12, 16–-21తో తనకంటే ఎంతో బలమైన, ఆరో సీడ్ చౌ టైన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 68 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్లో ఓడినా రెండో గేమ్లో ఖతర్నాక్ ఆటతో నెగ్గిన ఆయుష్ విజయంపై ఆశలు రేపాడు. కానీ, నిర్ణయాత్మక గేమ్లో చౌ టైన్ తన అనుభవాన్ని రంగరించి ఆడి గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ కపూర్– గద్దె -రుత్వికా శివాని 17–21, 11–21తో యుయిచి షిమోగమి–సయకా హబారా (జపాన్) చేతిలో ఓడారు.