డెత్ సర్టిఫికెట్లలో ‘కరోనా’ వద్దు

డెత్ సర్టిఫికెట్లలో ‘కరోనా’ వద్దు
  • ఇతరత్రా వ్యాధులుంటే.. వాటినే పేర్కొండి
  • డాక్టర్లకు చైనా సర్కారు హుకుం

బీజింగ్: కరోనా మరణాలు ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు  చైనా ప్రభుత్వం అన్ని  విధాలా ప్రయత్నిస్తోంది. ఎవరైనా ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతూ చనిపోతే.. అందుకు కారణం ‘కొవిడ్​ 19’ అని డెత్​ సర్టిఫికెట్లపై రాయొద్దంటూ డాక్టర్లకు ఓరల్​గా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. కరోనాతో చనిపోయిన వారు ఇతర జబ్బులతో బాధపడుతుంటే వాటినే డెత్ సర్టిఫికెట్లలో ప్రస్తావించాలని చైనా సర్కారు నిర్దేశించింది. 

మరణానికి కారణం కరోనానే అని భావిస్తే.. తొలుత ఆ విషయాన్ని తమ పై అధికారులకు తెలియజేయాలని పేర్కొంది. రెండు దశల్లో నిపుణుల ద్వారా ధ్రువీకరించుకున్న తర్వాతే.. అది కరోనా​మరణమా ? కాదా ? అనే దానిపై ప్రకటన చేయాలని ఆస్పత్రులకు సూచించింది. చైనాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే ఆరుగురు డాక్టర్లు ఈ వివరాలను తమతో చెప్పారని ఆ వార్తా సంస్థ వెల్లడించింది. మరణాలకు గల కారణాల్లో ‘కొవిడ్​ 19’ ప్రస్తావన లేకుండా చూడాలని ప్రభుత్వం నుంచే ఆదేశాలు వచ్చాయని కొందరు డాక్టర్లు చెప్పగా.. ఏ విభాగం నుంచి ఆదేశాలు​వచ్చాయనేది తెలియదని ఇంకొందరు చెప్పారని పేర్కొంది. కాగా, డిసెంబరు 8 నుంచి జనవరి 12 మధ్యకాలంలో చైనాలో దాదాపు 6‌‌0వేల మంది కరోనా కారణంగా చనిపోయారు. ఈ విషయాన్ని చైనా​జనవరి 14న అధికారికంగా ప్రకటించింది.  కరోనా మరణాల సంఖ్యను చైనా దాచడంపై గతంలో పలుమార్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) ఆందోళన వ్యక్తంచేసింది.