- స్పేస్కు ముగ్గురు చైనా వ్యోమగాములు
- ‘షెంఝౌ–16’ మిషన్లో సొంత స్పేస్ స్టేషన్కు పంపిన డ్రాగన్ కంట్రీ
- తొలిసారి ఒక చైనీస్ పౌరుడు కూడా స్పేస్లోకి..
బీజింగ్: చైనా తన సొంత స్పేస్ స్టేషన్ ‘తియాంగాంగ్’కు మరో ముగ్గురు వ్యోమగాములను విజయవంతంగా పంపింది. మంగళవారం ఉదయం వాయవ్య చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్గా చేపట్టినట్లు ‘చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్ఏ)’ వెల్లడించింది. ప్రయోగించిన పది నిమిషాలకు ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కూడిన షెంఝౌ–16 స్పేస్ షిప్ను రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి చేర్చినట్లు తెలిపింది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ వద్దకు స్పేస్ షిప్ చేరుకుందని, ఆ తర్వాత తియాన్హే మాడ్యూల్ కు అనుసంధానం అయిందని సీఎంఎస్ఏ పేర్కొంది. తదుపరి దశలో స్పేస్ షిప్లో ఉన్న ముగ్గురు ఆస్ట్రోనాట్లు స్పేస్ స్టేషన్లోకి వెళ్తారని.. గత నవంబర్ లో షెంఝౌ–15 మిషన్లో వెళ్లి స్పేస్ స్టేషన్లో ఉన్న ముగ్గురు ఆస్ట్రోనాట్లు స్పేస్ షిప్లోకి చేరుకుని, భూమికి తిరిగి వస్తారని వెల్లడించింది. కాగా, ప్రస్తుత మిషన్ లో స్పేస్ స్టేషన్కు పంపిన ముగ్గురు ఆస్ట్రోనాట్లలో బీహాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గూ హయిచావో పేలోడ్ స్పెషలిస్ట్గా వెళ్లారని సీఎంఎస్ఏ తెలిపింది. మిగతా ఇద్దరిలో జింగ్ హయిపెంగ్ మిషన్ కమాండర్గా, ఝూ యాంగ్జూ ఫ్లైట్ ఇంజనీర్గా పనిచేస్తారని పేర్కొంది. వీరు ముగ్గురు కూడా 5 నెలలపాటు స్పేస్ స్టేషన్లో పలు ప్రయోగాలు చేపట్టిన తర్వాత భూమికి తిరిగి వస్తారని వివరించింది.