పవర్ స్టార్..మెగాస్టార్..ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే. జనసేన పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వగా.. పాలిటిక్స్కు బై చెప్పేసి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలతో బిజీగా మారారు. దీంతో వీరిద్దరిని ఒకే వేదికపై చూసి చాలా రోజులైంది. అయితే తాజాగా పవర్ స్టార్, మెగా స్టార్ ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఫ్యాన్స్ను ఖుషీ చేశారు. ఓ నిర్మాత కూతురి వివాహ మహోత్సవంలో అన్నయ్య చిరంజీవి.. తమ్ముడు పవన్ కల్యాణ్ సందడి చేసి అభిమానులను అలరించారు.
హైదరాబాద్ హైటెక్స్లో జూన్ 23న ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ కుమార్తె వివాహం వైభవంగా జరిగింది. అతిరథ మహారధుల సమక్షంలో వరుడు ఆదిత్య, వధువు జాన్వీని వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకకు చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు కలిసి రావడం హైలైట్ గా నిలిచింది. అంతేకాదు చిరు, పవన్తో పాటు నాగార్జున కూడా గ్రూప్ ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. వీరితో పాటు.. గోపీచంద్, శివ కార్తికేయన్, నాగ చైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల, ప్రశాంత్ వర్మ, త్రివిక్రమ్, డి సురేష్ బాబు పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అటు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, మూవీ ఫైనాన్సియర్గా సినీ రంగానికి సునీల్ నారంగ్ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గానూ కొనసాగుతున్నారు. ఏషియన్ మల్టీప్లెక్స్, ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్న నారాయణ దాస్ కె.నారంగ్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అనే బ్యానర్ను స్టార్ట్ చేశారు.