గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతి రూపొందించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ జులై 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిన్న నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘గోపీచంద్ నాన్నగారు టి.కృష్ణ అద్భుతమైన దర్శకులు. నేను ఒంగోలులో జూనియర్ ఇంటర్ చదివేటప్పుడు ఆయన స్టూడెంట్ లీడర్. అప్పట్లో నాకెంతో సపోర్ట్ చేశారు. ఇద్దరం కలిసి ఇండస్ట్రీకి వచ్చినా కలిసి సినిమా చేయలేకపోయాం. ఇండస్ట్రీపై ఆయన అభిమానం గోపీచంద్ రూపంలో కనిపిస్తోంది. విలక్షణ పాత్రలతో కెరీర్ ప్రారంభించి, పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు గోపీచంద్. తను నటించిన సాహసం, ఒక్కడున్నాడు, చాణక్య చిత్రాలు నాకిష్టం. తను మరింత ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆశిస్తున్నా. ప్రజారాజ్యం పార్టీ టైమ్లో గ్రాఫిక్ డిజైనర్గా మారుతి పరిచయమయ్యాడు. అప్పుడే తనలో దర్శకుడున్నాడని చెప్పాను. అన్నట్టుగానే మంచి పొజిషన్కి వచ్చాడు. ఈ సినిమాలో అన్ని హంగులూ ఉన్నాయి. ఫుల్ మీల్స్లా పక్కా కమర్షియల్గా అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు. అలాగే మారుతి డైరెక్షన్లో నటించేందుకు ఇదే వేదికపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి.
గోపీచంద్ మాట్లాడుతూ ‘ఫస్ట్ టైమ్ నా సినిమా వేడుకకు వచ్చిన చిరంజీవి గారికి థ్యాంక్స్. ఆయన మా అందరికీ ఇన్స్పిరేషన్. ఈ సినిమాతో నాకు మంచి మిత్రుడయ్యాడు మారుతి. తనకున్న టాలెంట్కి ఇంకా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అల్లు అరవింద్ గారి బ్యానర్లో వర్క్ చేయడం హ్యాపీ. టీమ్ అందరి ఎఫెర్ట్తో సినిమా బాగా వచ్చింది’ అన్నాడు. ‘ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఇది నా బెస్ట్ క్యారెక్టర్. అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది’ అని చెప్పింది రాశీఖన్నా.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘టి.కృష్ణ గారితో సినిమా అనుకున్నాం. కానీ కుదరలేదు. ఇన్నాళ్లకీ వాళ్లబ్బాయితో తీయడం సంతోషం. ఈవీవీగారిలా ప్రేక్షకులను నవ్వించే పల్స్ మారుతికి బాగా తెలుసు. అతని సక్సెస్కి అదే కారణం. రాశీఖన్నా క్యారెక్టర్ హిలేరియస్గా ఉంటుంది’ అని చెప్పారు. మారుతి మాట్లాడుతూ ‘చిరంజీవి గారి ప్రోత్సాహం వల్లే దర్శకుడిగా ఎదిగా. అరవింద్ గారు గాడ్ ఫాదర్లా వెన్నంటే ఉండి నా కెరీర్ గ్రాఫ్ను పెంచారు’ అన్నారు. టీమ్ అందరికీ ఈ సినిమాతో సక్సెస్ రావాలని కోరుకుంటున్నా అన్నారు బన్నీ వాసు. తనకీ చాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది శియా గౌతమ్. నిర్మాత దిల్ రాజు, దర్శకులు పవన్ సాధినేని, కౌశిక్, సుబ్బు, నటులు రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, సప్తగిరి, వైవా హర్ష, అజయ్ ఘోష్, లిరిక్ రైటర్ కృష్ణకాంత్, నిర్మాత వివేక్ కూచిభొట్ల, కో ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ తదితరులు పాల్గొన్నారు.