ఎమ్మెల్యేలపై సీఐడీ ఎంక్వైరీ చేయించాలె

ఎమ్మెల్యేలపై సీఐడీ ఎంక్వైరీ చేయించాలె

యాదాద్రి, వెలుగు : భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్​రెడ్డి, గొంగిడి సునీతపై సీఐడీ ఎంక్వైరీ జరిపించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్​ చేశారు. ట్రిపుల్​ఆర్​ అలైన్​మెంట్​మార్పు కోసం ఆందోళన చేసి జైలుకు పోయొచ్చిన రైతులను యాదాద్రి జిల్లా రాయగిరిలో టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ బీర్ల అయిలయ్యతో కలిసి ఆయన పరామర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండలు, గుట్టలు, భూదాన్, అసైన్డ్​ ల్యాండ్స్​ను ఎమ్మెల్యేలు కొన్నారని ఆరోపించారు. ‘ఈ​ సర్కారు ఉండేది ఆరునెలలే. దానికి పోయే కాలమొచ్చింది. అందుకే ఓఆర్ఆర్​అమ్మేసి,  రైతులకు బేడీలు వేశారు’ అని అన్నారు. ఓఆర్ఆర్​, ట్రిపుల్ ​ఆర్​ను అడ్డం పెట్టుకొని రూ.వేల, లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. 

యాదాద్రి డీసీపీని ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ​ఆదేశాలతో డీసీపీ ప్రెస్​మీట్​పెట్టి వారు రైతులు కాదంటూ స్టేట్​మెంట్​ఇచ్చారని, రైతులను పట్టుకొని కాదని ఎలా అంటావని, స్టేట్​మెంట్​ వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. మరోసారి ఇలాంటి కామెంట్లు చేస్తే డీసీపీ అని కూడా చూడమన్నారు. ‘ఆందోళన చేసిన రైతులపై కేసులు ఏమైనా ఉన్నాయా? వాళ్లను జైలుకు పంపించి, బేడీలు వేస్తారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడున్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఒక్కడు కూడా పనికి రాడు. ఏ ఒక్కడూ గెలవడు’ అని ఘాటుగా కామెంట్ చేశారు. 

ఉమ్మడి జిల్లాకు మంత్రి ఉన్నా.. లేనట్టే అని అన్నారు. కుంటలు మింగి, జాగలు కబ్జా చేయడం తప్పా ఆయనకేం తెలియదన్నారు. ఈ చిన్న రైతుల దగ్గరే తక్కువ రేటుకు వందలాది ఎకరాలను ఎమ్మెల్యేలు, లీడర్లు కొని  భూస్వాములయ్యారన్నారు. ట్రిపుల్ ​ఆర్ ​కోసం భూ సేకరణ రాష్ట్రం పరిధిలోని అంశమని, అందుకే వంగపల్లి మీదుగా వెళ్లాల్సిన ట్రిపుల్ ​ఆర్​ రాయగిరికి మారిందని ఆరోపించారు. ఇక నుంచి రైతులకు సమస్య వస్తే తానే ముందుండి జైలుకు వెళ్తానన్నారు.