కాగజ్ నగర్ వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలని చూస్తోందని, ఈ ఆలోచనను విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభ ఆదివారం కాగజ్ నగర్లోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని అమలు చేస్తే ఐసీడీఎస్ మూతపడే అవకాశం ఉందన్నారు.
ఐసీడీఎస్ ప్రైవేటీకరణలో భాగంగా పీఎంశ్రీ, మొబైల్ అంగన్వాడీ సెంటర్స్, నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తెచ్చిందని, వీటిని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి త్రివేణి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మాచెర్ల వినోద తదితరులు పాల్గొన్నారు.
