బ్యాలెట్ ఓటింగ్లో కార్మికులు పాల్గొనాలి : సీఐటీయూ

బ్యాలెట్ ఓటింగ్లో కార్మికులు పాల్గొనాలి : సీఐటీయూ

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల సొంతింటికల నెరవేర్చడమే లక్ష్యంగా సీఐటీయూ పోరాడుతోందని ఆ యూనియన్​ మందమర్రి ఏరియా ప్రెసిడెంట్​ ఎస్.వెంకటస్వామి అన్నారు. ఆదివారం రామకృష్ణాపూర్​లోని సీఐటీయూ ఆఫీస్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా నెలకొన్న సమస్యలపై గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. సొంతింటి పథకం,పెర్క్స్​పై ఇన్​కమ్​ ట్యాక్స్​ మాఫీ, మారుపేర్ల సవరణ తదితర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, కానీ రెండేండ్లు గడిచినా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ఇప్పటి వరకు ఏ సమస్యలను పరిష్కరించలేదన్నారు.

 సీఐటీయూ ఆధ్వర్యంలో ‘సొంతిల్లు కావాలా..క్వార్టర్​ కావాలా’ అనే డిమాండ్​తో ఈనెల 11,12 తేదీల్లో అన్ని గనులు, డిపార్ట్​మెంట్లలో నిర్వహించే బ్యాలెట్​ఓటింగ్​లో కార్మికులంతా పాల్గొనాలని కోరారు. సింగరేణికి చెల్లించాల్సిన విద్యుత్​ బకాయిలను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరం లాభాల్లో కార్మికులకు 35శాతం వాటా చెల్లించాలని డిమాండ్​చేశారు. ఏరియా జనరల్​ సెక్రటరీ అల్లి రాజేందర్, వైస్​ ప్రెసిడెంట్ ​రామగిరి రామస్వామి, లీడర్లు రమేశ్, సంజీవరెడ్డి, సురేశ్, మల్లేశ్, కుమారస్వామి, తాజోద్దిన్, శ్రీధర్, ఆదర్శ్​ పాల్గొన్నారు.