
- షాద్ నగర్ థర్డ్ డిగ్రీ ఘటనలో పోలీసులపై అట్రాసిటి కేసు పెట్టి.. జాబ్ ల నుంచి తొలగించాలి
- పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు
షాద్ నగర్,వెలుగు : దళిత మహిళ సునీతపై థర్డ్ డిగ్రీలో బాధ్యులపై పోలీసులను జాబ్ ల నుంచి తొలగించి అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,ప్రధాన కార్యదర్శి నారాయణ రావు డిమాండ్ చేశారు. ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిజనిర్ధారణ చేశారు.
కేశంపేట మండలం పాపిరెడ్డిగూడకు వెళ్లి బాధితురాలు సునీతను వివరాలు అడిగి తెలుసుకుని.. అనంతరం షాద్ నగర్ టౌన్ లో మీడియాతో మాట్లాడారు. పోలీసులతో ఫిర్యాదుదారుడు నాగేందర్ తో ఉన్న సంబంధమేంటని ప్రశ్నించారు. పోలీసుల థర్డ్ డిగ్రీతో పూర్తి అంగవైకల్యానికి గురైన బాధిత మహిళ సునీత భర్తకు ప్రభుత్వ జాబ్ ఇవ్వడంతో పాటు కుమారుడికి నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. పౌరహక్కుల సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు సుభాన్, ప్రధాన కార్యదర్శి బాలయ్య, సహాయ కార్యదర్శి రాములు,లక్ష్మి నారాయణ, వెంకటయ్య, బాలకృష్ణ, మహేశ్ ఉన్నారు.