మీ వెంటే ఉంటాం కుంభంను కలిసిన.. భువనగిరి లీడర్లు

 మీ వెంటే ఉంటాం కుంభంను కలిసిన.. భువనగిరి లీడర్లు

యాదాద్రి, వెలుగు :  యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​ రెడ్డి వెంటే ఉంటామని భువనగిరికి చెందిన కాంగ్రెస్​ లీడర్లు స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా భువనగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు అసమ్మతి లీడర్లు మీటింగ్​ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అనుకూల వర్గానికి చెందిన లీడర్లు కొందరు హైదరాబాద్​లోని కుంభం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అసమ్మతి లీడర్లు నిర్వహించిన మీటింగ్​పై లీడర్ల మధ్య చర్చ జరిగింది. 

ఎన్నికలు సమీపిస్తున్నందున కావాలనే కుంభంపై ఆరోపణలు  చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్నికల సమయంలో సొంత పార్టీ లీడర్​పై ఆరోపణలు చేయడం ద్వారా కాంగ్రెస్​కు నష్టం జరిగి, బీఆర్​ఎస్​కు లాభం కలుగుతుందన్న ఆలోచన కూడా లేకుండా మీటింగ్​లు నిర్వహించడం సరికాదంటూ పలువురు లీడర్లు కామెంట్ చేశారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ముఖ్య లీడర్​ హస్తం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని పలువురు ప్రస్తావించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  కుంభం ఓడిపోయినా.. పార్టీని అంటిపెట్టుకొని ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్​కు అండగా నిలబడినప్పటికీ దుష్ప్రచారం చేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది.