ప్లెక్సీ పెట్టలేదంటూ బీజేపీ–టీఆర్ఎస్ మధ్య ఘర్షణ

ప్లెక్సీ పెట్టలేదంటూ బీజేపీ–టీఆర్ఎస్ మధ్య ఘర్షణ

సిద్ధిపేట: జిల్లాలోని దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే వారు గొడవపడ్డారు. శుక్రవారం దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట–భూంపల్లి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంక్ ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావు వచ్చారు. ఆయనతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫోటో లేకపోవడం వివాదానికి దారి తీసింది.

రఘునందన్ రావు ఫోటో ఎందుకు పెట్టలేదని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించారు. కనీసం ప్రోటోకాల్ పాటించరా అంటూ వారు అధికారులను నిలదీశారు. దీంతో టీఆర్ఎస్–బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు తోపులాటకు దిగారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.