కొద్ది రోజుల క్రితం కర్ణాటకను కుదిపేసిన హిజాబ్ వివాదం ఇప్పుడు పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని తాకింది. మంగళవారం ఉదయం హౌరాలోని ధులాగోరిలో ఉన్న ఒక ప్రభుత్వ విద్యాసంస్థలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న పలువురు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. తమను తరగతి గదిలోకి అనుమతించాలని పాఠశాల నిర్వాహకులను కోరారు. హిజాబ్ ధరించిన పలువురు విద్యార్థినులను తరగతి గదిలోకి అనుమతించినప్పుడు.. కాషాయ కండువాలతో తమను కూడా అనుమతించాలని వారు డిమాండ్ చేశారు.
ఈక్రమంలో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఘటనలో ఫర్నీచర్ ధ్వంసమైంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న 11, 12వ తరగతుల పరీక్షలను విద్యాసంస్థ యాజమాన్యం రద్దు చేసింది. స్కూల్ యూనిఫాంతో వస్తేనే తరగతి గదిలోకి విద్యార్థులకు అనుమతి ఇస్తామని యాజమాన్యం వెల్లడించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను సంఘటనా స్థలానికి పంపించారు.