ఆమనగల్లు, వెలుగు: ఆమనగల్లు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో అధికార పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. సార్ విగ్రహానికి ముందుగా ఎంపీపీ అనిత పూలమాలలు వేసి ఆఫీసులోకి వెళ్లిపోయారు. అనంతరం అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జడ్పీటీసీ అనురాధ, ఇతర నేతలు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇదే సమయంలో ఆఫీసు నుంచి బయటికి వచ్చిన ఎంపీపీ తనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్యే, జడ్పీటీసీ, పార్టీ నాయకులతో వాదనకు దిగారు. స్పందించిన ఎమ్మెల్యే సమాచారం ఇవ్వలేదన్న విషయం తనకు తెలియదని చెప్పి వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య వర్గపోరు మరోసారి బయటపడ్డట్లైంది. ఇటీవల మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను సైతం వేర్వేరుగా నిర్వహించారు.