సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జూన్ 20న సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నల్గొండ జిల్లా కేతేపల్లిలో ఆయన చేపట్టిన పాదయాత్ర పీపుల్స్ మార్చ్కొనసాగుతోంది. ఈ క్రమంలో మోకాలినొప్పులు, జ్వరం కారణంగా సాయంత్రం వరకు చేయాల్సిన పాదయాత్రను వైద్యుల సూచన మేరకు నిలిపేశారు. సూర్యాపేట నుంచి వచ్చిన వైద్యులు నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్య చికిత్సలు అందించారు. వడదెబ్బ కారణంగా హైఫీవర్ ఉందని వారు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. పీపుల్స్ మార్చ్ యాత్ర చేపట్టి 97 రోజులు పూర్తయింది.
పలువురి పరామర్శ
భట్టి విక్రమార్క అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం డీసీసీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, వరంగల్ డీసీసీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావిద్ తదితరులు ఆయనను పరామర్శించారు.