ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే కరోనా బారి నుండి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడిన వారవుతారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లాక్ డౌన్ పాటించకపోవడం వల్ల అగ్ర దేశాలలో అధిక ప్రాణనష్టం సంభవించిందని… మన దేశంలో అటువంటి పరిస్థితి చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రధాని , రాష్ట్ర ముఖ్యమంత్రి ముందస్తుగానే పటిష్టమైన చర్యలు తీసుకున్నారని తలసాని తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు నిత్యావసరాలకై కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న క్రమంలో గురువారం తెలంగాణ క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను పేదలకు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా మహమ్మారికి అభివృద్ధి చెందిన దేశాలే విరవిలలాడుతున్నాయని… దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుగానే లాక్ డౌన్ ప్రతిపాదించారని అన్నారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుచడా అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి విపత్కరమైన సమయంలో పేదలను ఆదుకోడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.