అలంపూర్ ఎమ్మెల్యే కమీషన్లు తీసుకుంటుండు

అలంపూర్ ఎమ్మెల్యే కమీషన్లు తీసుకుంటుండు

జోగులాంబ గద్వాల్: కేసీఆర్ ఊసరవెల్లికి గురువులాంటోడని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం ఎర్రవెల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పూటకో మాట... పూటకో వేశంతో కేసీఆర్ రంగులు మారుస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆగమాగమవుతోందన్నారు. రైతులు, నిరుద్యోగులు, కార్మికులు, విద్యార్థులు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికలప్పుడే కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారన్నారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్న షర్మిల... అందుకే మునుగోడులో వంగి వంగి దండాలు పెట్టారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కేసీఆర్ గొప్పలు చెప్పారని, కానీ ఒక్క వానకే ప్రాజెక్ట్ మొత్తం మునిగిపోయిందని విమర్శించారు. కేసీఆర్ లాంటోడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలి పోయిందంట అని ఎద్దేవా చేశారు. ఇక స్థానిక ఎమ్మెల్యే , అతడి కుమారుడు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరో పించారు. ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేసే క్రమంలో తండ్రికొడుకులిద్దరూ ముక్కుపిండి కమీషన్ వసూలు చేస్తారని ఆరోపించారు. ఓ దళిత ఎమ్మెల్యేగా ఉండి కూడా దళిత బంధు లబ్దిదారుల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన రావాలంటే వైఎస్ఆర్టీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.